ఫలితాలతో కంగుతిన్న తమ్ముళ్లు
నిర్మానుష్యంగా చంద్రబాబు నివాసం.. టీడీపీ కార్యాలయం
మూగబోయిన టీడీపీ సోషల్మీడియా విభాగం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. అంతా అనుకున్నట్లే.. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారమే ఫ్యాన్ జోరుగా దూసుకెళ్తుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వేవ్ స్పష్టంగా కనిపిస్తోంది. ఫ్యాన్ జోరుకు అధికార టీడీపీ బేజార్ అయింది. ఆస్థాన సర్వేచిలక లంగడపాటి రాజగోపాల్ పలికిన పలుకులతో ధీమాగా ఉన్న టీడీపీ క్యాడర్.. ఫలితాలు చూసి కంగుతిన్నది. వైఎస్సార్సీపీ 135 సీట్ల ఆధిక్యం సాధించడంతో తమ్ముళ్లు ముఖం చాటేశారు. ఎప్పుడూ హడావుడిగా ఉండే చంద్రబాబు నివాసం వైఎస్సార్సీపీ ప్రభంజనంతో బోసిపోయింది. పార్టీ కార్యాలయం నిర్మానుష్యంగా మారింది.
ఫలితాలన్ని వైఎస్సార్సీపీకి ఏకపక్షంగా వస్తుండటం.. పార్టీ అధినేత, 40 ఏళ్ల అనుభవజ్ఞుడు చంద్రబాబే ఓటమి దిశగా కుప్పంలో వెనుకంజలో నిలవడం.. తెలుగు తమ్ముళ్లను దిక్కుతోచని స్థితి పడేసింది. ఇక ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా హడావుడి చేసే తమ్ముళ్లు తాజా ఫలితాలతో నోరు మెదపడం లేదు. యాక్టివ్గా ఉండే చంద్రబాబు ఆయన సుపుత్ర రత్నం నారాలోకేష్, టీడీపీ అధికారిక ట్విటర్ అకౌంట్లు మూగబోయాయి.