నారాయణ మాటలు నీటిమూటలు

23 Jun, 2018 13:30 IST|Sakshi
మాట్లాడుతున్న ఎమ్మెల్యే అనిల్‌

మంత్రిపై ఎమ్మెల్యే అనిల్‌ ధ్వజం

నెల్లూరు(సెంట్రల్‌): నగరంలోని మైనార్టీలకు కోట మిట్టలో షాదీమంజిల్‌ను ఈ రంజాన్‌లోపు నిర్మి స్తామని చెప్పిన మంత్రి నారాయణ మాటలు నీటిమాటలుగా మిగిలిపోయాయని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ విమర్శించారు. కోటమిట్టలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. షాదీమంజిల్‌ను అధునాతనంగా నిర్మిస్తానని జనవరిలో మంత్రి చెప్పారని, అయితే కనీసం శంకుస్థాపన చేశారానని ప్రశ్నించారు. తాము ఏది మాట్లాడినా రాజకీయం అంటారని, అయితే ఏడు నెలలుగా కనీసం పట్టించుకోరానని ప్రశ్నించారు. నగరంలోని గంజిఖానాలో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి తాను ఎంపీ నిధుల నుంచి రూ.30 లక్షలను తీసుకొచ్చానని, అయితే షాదీమంజిల్‌ను నిర్మిస్తున్నప్పుడు ఇది ఎందుకని చెప్పడంతో నిధులు వెనక్కి వెళ్లిపోయాయని ఆరోపించారు.

మంత్రివర్గంలో మైనార్టీలకు స్థానమేదీ..?
ప్రస్తుతం ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేరని, మైనార్టీలపై టీడీపీ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో దీని ద్వారా అర్థమవుతోందని చెప్పారు. చంద్రబాబు ఇక్కడ బీరాలు పలుకుతూ, ఢిల్లీలో వంగి దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ, టీడీపీ మధ్య సంబంధం కొనసాగుతుంటే, ప్రతిపక్షంపై నెపం వేయాలని చూడటం సిగ్గుచేటని విమర్శించారు. ఇతర రాష్ట్రంలోని బీజేపీకి చెందిన మంత్రి సతీమణికి టీటీడీ బోర్డులో స్థానం ఎలా కల్పించారని ప్రశ్నించారు.

శ్వేతపత్రం విడుదల చేయాలి
నెల్లూరులోని దర్గామిట్టలో గల దర్గా వద్ద రూ.20 కోట్లతో ఏదో చేశామని మంత్రి, టీడీపీ నాయకులు బీరాలు పలకడం కాదని, ఇప్పటి వరకు ఎంత నిధులు కచ్చితంగా వచ్చాయో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. షాదీమంజిల్‌ ఉండే జెండావీధి ప్రాంతంలో ఇరుకు రోడ్డులో డివైడర్‌ను ఏర్పాటు చేయడంపై స్థానికులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారన్నారు. కార్పొరేటర్లు ఖలీల్‌ అహ్మద్, ఓబిలి రవిచంద్ర, గోగుల నాగరాజు, దేవరకొండ అశోక్, నాయకులు హంజాహుస్సేన్, మునీర్‌ సిద్ధిఖ్, కుంచాల శ్రీనివాసులు, నజరుల్లా, అతహర్‌బాషా, ఫజల్, అహ్మద్, ఆరిఫ్, మైనుద్దీన్, తారీఖ్‌ అహ్మద్, ఇంతియాజ్, మున్వర్, పఠాన్‌ ఫయాజ్‌ఖాన్, మున్నా, కాలేషా, ముజీర్, మంజూర్, బాబాభాయ్, షబ్బీర్, జావీద్, మస్తాన్, అలీమ్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు