‘పవన్‌ పద్ధతిగా మాట్లాడటం నేర్చుకో’..

23 Mar, 2019 17:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోవాలని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ సూచించారు. రాజకీయ లబ్ధికోసమే పవన్‌ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ కులాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. పవన్‌ కళ్యాణ్‌లా ఊసరవెల్లిలా తాము మారలేమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ సోదరుడు నాగబాబు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన ఓటు టీఆర్‌ఎస్‌కు వేశానని స్వయంగా చెప్పినట్లు పేర్కొన్నారు. ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారు, ఎవరు టీఆర్‌ఎస్‌ గెలవాలని కోరుకున్నారంటూ ప్రశ్నించారు.

ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారన్నారు. చంద్రబాబు హత్యరాజకీయాల్లో ఆరితేరారని, సొంత మామనే వెన్నుపోటు పొడిచారంటూ దుయ్యబట్టారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య జరిగి పదిరోజులైనా నిందితులను కనిపెట్టకపోవటం ప్రభుత్వ వైఫల్యంగా పేర్కొన్నారు. పవన్‌ ప్రశ్నించాల్సింది ప్రతిపక్షాన్ని కాదని, అధికారపార్టీనని చెప్పారు. ఐదేళ్లలో చం‍ద్రబాబు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. అని ప్రజలు ఎదురుచూస్తున్నారని, ఐదేళ్ల పాలన చూసి ఓటేయమని అడిగే దమ్ము బాబుకు ఉందా అన్ని ప్రశ్నించారు. ఆస్తులకోసం అన్నదమ్ములను చంపుకున్న చరిత్ర కళా వెంకట్రావుది అంటూ మండిపడ్డారు.

మరిన్ని వార్తలు