‘గేట్లు పెట్టి డబ్బా కొట్టుకోవడం విడ్డూరం’

27 Dec, 2018 11:58 IST|Sakshi

పార్లమెంట్‌ ఆవరణలో వైఎస్సార్‌ సీపీ ధర్నా

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయంపై వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ సభ్యులు పార్లమెంట్‌లో పోరాటం కొనసాగిస్తున్నారు. గురువారం పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కాగానే.. వైఎస్సార్‌ సీపీ ఎంపీలు వి విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డిలు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. అంతేకాకుండా పత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్‌ సీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లారు. ఎంపీల నిరసనలతో రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడింది.

పార్లమెంట్‌ వెలుపల కూడా వైఎస్సార్‌ సీపీ నాయకులు తమ నిరసనలను కొనసాగించారు. గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్‌ నాయకులు ధర్నాకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు డ్రామాలను జనం నమ్మేందుకు సిద్ధంగా లేరని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని అన్నారు. చంద్రబాబు అసమర్థ ముఖ్యమంత్రి అని వ్యాఖ్యానించారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ శంకుస్థాపనతో నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. అమరావతి నిర్మాణాన్ని గ్రాఫిక్స్‌లో చూపించి జనాన్ని మాయ చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజక్టుకు గేట్లు పెట్టి డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

పునాది రాయి పేరిట డ్రామాలు...
ఆగమేఘాలమీద కడప స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన చంద్రబాబుపై కడప మాజీ అవినాష్‌ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఎన్నికల స్టంట్‌లో భాగంగానే స్టీల్‌ ప్లాంట్‌కు కొబ్బరికాయ కొట్టారని అన్నారు. ఆ ప్లాంట్‌కు చంద్రబాబు పెట్టే ఖర్చు నాలుగు టెంకాయలు మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఈ ధర్నాలో ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాద్‌, మిథున్‌రెడ్డి, నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అనంత వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు