‘విభేదాలు సృష్టించడానికి చంద్రబాబు యత్నం’

16 Sep, 2019 20:08 IST|Sakshi

సాక్షి, విజయవాడ : గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు న్యాయవాదులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లీగల్‌ సెల్‌ సభ్యుడు కోటమరాజు వెంకటశర్మ విమర్శించారు. విజయవాడలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి న్యాయవాదుల సంక్షేమం కోసం బడ్జెట్‌లో వంద కోట్లు కేటాయించారని తెలిపారు. హైకోర్టు న్యాయవాదుల ఇళ్ల స్థలాల కేటాయింపుకు కార్యచరణ రూపొందిచారన్నారు. అలాగే జూనియర్‌ న్యాయవాదులకు సైతం గౌరవభృతి సదుపాయం కల్పించారని గుర్తుచేశారు. హైకోర్టు కర్నూలుకు తరలిపోతుందంటూ చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఆయన కుట్రలను వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ ఖండిస్తుందని అన్నారు. న్యాయవాదుల మధ్య విభేదాలు సృష్టించి టీడీపీ నేతలు పబ్బం గడుపుకునేందుకు యత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.

మరిన్ని వార్తలు