టీడీపీవన్ని ఓటు దీక్షలే : రాచమల్లు

20 Jun, 2018 11:32 IST|Sakshi

వైఎస్సార్‌ జిల్లా (ప్రొద్దుటూరు) : కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మేల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి 48 గంటల దీక్ష ప్రారంభించిన సంగతి తెలిసిందే. రెండో రోజు కొనసాగుతున్న రాచమల్లు దీక్షకు రాష్ట్రవ్యాప్తంగా అనూహ్య మద్దతు లభిస్తుంది. ఈ సందర్భంగా రాచమల్లు స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం చేసేవరకూ దీక్ష ఆగదన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ గురించి నాలుగేళ్లు మాట్లాడకుండా ఉన్న టీడీపీ నేతలు ఇప్పుడు ఉక్కురాగం ఎత్తుకున్నారని మండిపడ్డారు.

వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసమే టీడీపీ నేత సీఎం రమేష్‌ ఆమరణ దీక్ష చేస్తానంటున్నారని, టీడీపీవన్ని ఓట్ల కోసం చేసే దీక్షలేనని విమర్శించారు. ఉక్కు పరిశ్రమ నిర్మాణం జరిగితే ఉద్యోగాలు వస్తాయి. యువతకు ఉపాధి లభిస్తుంది. అందుకే మొదట్నుంచి వైఎస్సార్‌సీపీ ఉక్కు పరిశ్రమ నిర్మాణం కోసం పోరాటం చేస్తుందన్నారు. టీడీపీ నేతలకు వైఎస్సార్‌ జిల్లా ప్రజలపై ప్రేమ లేదు. అందుకే వారు జిల్లాకు ఉక్కు పరిశ్రమ రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్‌లో దీక్ష చేస్తున్నఎమ్మేల్యే రాచమల్లుకు రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నేతలు, రాయలసీమ సాధన సమితి అధ్యక్షుడు కుంచెం వెంకట సుబ్బారెడ్డి మద్దతు తెలిపారు.

మరిన్ని వార్తలు