పవన్‌ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు: టీజేఆర్‌

7 Dec, 2018 16:18 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌ బాబు

విజయవాడ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిథి టీజేఆర్‌ సుధాకర్‌ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సుధాకర్‌ బాబు విలేకరులతో మాట్లాడుతూ..పవన్‌ కల్యాణ్‌ మా నాయకుడు జగన్‌పై చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పవన్‌ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. పవన్‌ జాగ్రత్త..నీ నోటిని పొదుపుగా వాడు..నీ వేషాలు మా దగ్గర కాదని హెచ్చరించారు. జగన్‌ ఎప్పుడూ పోరాడే వ్యక్తి అని కొనియాడారు. జగన్‌ పారిపోయే రకం కాదని, ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని పోరాడుతున్నారని వ్యాఖ్యానించారు.

ఇంకా మాట్లాడుతూ.. ‘ అభాగ్యులకు అండగా ఉండే జగన్‌పై విమర్శలా?. పవన్‌ నీ సిద్ధాంతం ఏంటి. నీ వేషాలు ఏంటి. ప్యాకేజీ తీసుకుని ఇప్పుడు రోడ్లపైకి వచ్చి ప్రజల చెవిలో పూలు పెడతావా. మీ అన్న చిరంజీవిని అడుగు జగన్‌ గురించి ఏం చెబుతాడో తెలుస్తుంది. మీలాగా ప్రజల్ని మధ్యలో వదిలి పారిపోయే కుటుంబం వైఎస్సార్‌ది కాదు. జగన్‌ను వ్యక్తిగతంగా దూషిస్తూ మళ్లీ మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని దూషిస్తున్నారని అంటావా. నీవు మూడు పెళ్లిళ్లు చేసుకుంది నిజం కాదా. ఒకరితో కాపురం చేస్తూ మరొకరితో పిల్లల్ని కన్నది వాస్తవమా కాదా’  అని సూటిగా ప్రశ్నించారు.

‘  ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటు లైఫ్‌ ఉండదు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడు. చవకబారు మాటలు ఆపు. చేగువెరా లక్షణాలు జగన్‌కే ఉన్నాయి నీకు కాదు. పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి పేర్లు చెప్తావ్‌..కానీ చేతలు మాత్రం శూన్యం. బడుగు బలహీన వర్గాలకు వైఎస్‌ జగన్‌ అండగా ఉన్నారు. ఆయన్ని విమర్శిస్తే మేము చూస్తూ ఊరుకోం. మా  దళితుల తరపున పోరాడుతున్న జగన్‌పై నువ్వా మాట్లాడేది. వనజాక్షి, సదావర్తి, రాజధాని భూములు తదితర విషయాల్లో అక్రమాలు జరగుతుంటే ముసుగు తన్ని పడుకున్నావ్‌ నువ్వు. నీ సినిమాలు ఫ్లాప్‌ అయి నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఏం చేశావు. పవన్‌ పిచ్చి మాటలు ఆపు.. బాక్సైట్‌ గురించి తెలియకపోతే పక్కనున్న మనోహర్‌ని అడుగు చెబుతార’ ని తీవ్రంగా సుధాకర్‌ బాబు విమర్శించారు.

పవన్‌కు పిచ్చి ముదిరింది: నందిగం సురేష్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు పిచ్చి బాగా ముదిరిపోయిందని, బాలకృష్ణలా మీరు కూడా సర్టిఫికేట్‌ తెచ్చుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు నాయుడు, పవన్‌ ఇద్దరూ ఒకటేనని, కావాలని డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. పవన్‌ కల్యాణ్‌ మీరు బాలకృష్ణ-2 లా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు డైరెక్షన్‌లో నడవడమే పవన్‌కు తెలుసునని అన్నారు. చంద్రబాబు నుంచి భారీ ప్యాకేజీ వచ్చింది కాబట్టే వైఎస్సార్‌సీపీపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. దశ, దిశ లేని పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేనే అని ధ్వజమెత్తారు. పవన్‌ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు