లోక్‌సభ 17వ స్పీకర్‌గా ఓమ్‌ బిర్లా!

18 Jun, 2019 11:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : 17వ లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉన్న బీజేపీ ఎంపీ ఓమ్‌ బిర్లాకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ప్రకటించింది. లోక్‌సభ స్పీకర్‌గా ఓమ్‌ బిర్లాను ప్రతిపాదిస్తూ వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి సంతకం చేశారు. ఓమ్‌ బిర్లాలకు పలు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. దీంతో స్పీకర్‌గా ఓమ్‌ బిర్లా ఎన్నిక ఏకగ్రీవం కానుంది. 

ఓమ్‌ బిర్లా రాజస్తాన్‌లోని కోట నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ తరపున ఎంపీగా గెలిచారు. కోట-బుండి నియోజకవర్గం నుంచి ఆయన వరుసగా రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రామ్‌నారాయణ్‌ మీనాపై 2.5 లక్షల మెజార్టీతో గెలుపొందారు. 

లోక్ సభ స్పీకర్ గా ఓమ్ బిర్లా నియామకం దాదాపుగా పూర్తి అయినట్లు వస్తున్న వార్తలపై ఆయన భార్య అమితా బిర్లా స్పందించారు.‘ ఇది మాకు చాలా గర్వకారణమైన,సంతోషకరమైన సమయం. ఓమ్ బిర్లాను స్పీకర్ గా ఎన్నుకుంటున్నందుకు కేబినెట్ ధన్యవాదాలు చెబుతాను’  అని అబితా బిర్లా పేర్కొన్నారు. 

కాగా మంగళవారం ఉదయం బీజేపీ జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఓమ్ బిర్లా సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..లోక్ సభ స్పీకర్ ఎన్నికపై తనకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. ఓ కార్యకర్తలానే నడ్డాతో సమావేశమైనట్లు తెలిపారు.కాగా  ప్రొటెం స్పీకర్‌గా వీరేంద్ర కుమార్‌ నియాకమైన విషయం విదితమే. స్పీకర్‌ ఎన్నిక పూర్తయ్యే వరకు వీరేంద్ర కుమార్‌ ప్రొటెం స్పీకర్‌గా కొనసాగనున్నారు.

మరిన్ని వార్తలు