రుణమాఫీ కాకుండా అడ్డుకుంటున్నారయ్యా
‘అయ్యా.. బ్యాంకులో పాస్ పుస్తకాలు పెట్టి రూ. 9 వేలు పంట రుణం తీసుకున్నా. టీడీపీ ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లయినా ఇప్పటికీ రుణమాఫీ కాలేదు. వైఎస్సార్ సీపీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాననే అక్కసుతో టీడీపీ నాయకులు రుణమాఫీ కాకుండా అడ్డుకుంటున్నారు’ అని గూడూరు రూరల్ మండలం కందలి గ్రామానికి చెందిన కావూరి వెంకటమ్మ జననేత ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. బ్యాంకుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఎలాంటి సమాధానం చెప్పడం లేదని కన్నీళ్లు పెట్టుకుంది.
జీవనోపాధి కల్పించండన్నా
‘అన్నా.. గతేడాది ఎంసీఏ కోర్సు పూర్తి చేశా. చదువుకు తగిన ఉద్యోగం దొరక్క ఖాళీగా ఉన్నా. ఇంజినీరింగ్ చదివిన మా అన్నయ్యకూ ఉద్యోగం లేదు. తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. మాకో చెల్లి ఉంది. ఉద్యోగం లేకపోవడంతో కుటుంబ గడవటం రోజురోజుకూ కష్టమవుతోంది’ అంటూ చెన్నూరుకు చెందిన సుమాంజలి వైఎస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. మీరే తగిన జీవనోపాధి కల్పించాలని విజ్ఞప్తి చేసింది. స్పందించిన జననేత తగిన చర్యలు తీసుకోవాలని తన సిబ్బందిని ఆదేశించారు.