‘భారత్‌తో ఆసీస్‌కు ముప్పే’

8 Jun, 2019 20:15 IST|Sakshi

లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు భారత్‌తో పెను సవాల్‌ ఎదురుకానుందని ఆ దేశ దిగ్గజ ఆటగాడు అలెన్‌ బోర్డర్‌ అభిప్రాయపడ్డాడు. ఈ మెగా టోర్నీలో అన్ని జట్లకు భారత్‌ గట్టి ప్రత్యర్థి అనడంలో ఎటువంటి సందేహం లేదని, ఆసీస్‌ కూడా జాగ్రత్తగా ఆడకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నాడు. భారత క్రికెట్‌ జట్టులో కొన్ని బలహీనతలున్నప్పటికీ ఆ జట్టుతో పోరు ఆసీస్‌కు చాలా పెద్ద చాలెంజ్‌ అని పేర్కొన్నాడు.

‘భారత్‌తో ఆసీస్‌కు ముప్పే. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత్‌ కాస్త ఇబ్బంది పడింది. దక్షిణాఫ్రికా బాగానే ఆడింది. కానీ  సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయలేదు. భారత్‌ ఇన్నింగ్స్‌కు రోహిత్‌ శర్మ వెన్నెముకలా నిలిచాడు. భారత్‌కు కొన్ని బలహీనతలు ఉన్నాయి. కానీ రోహిత్‌, కోహ్లి, బుమ్రా లాంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. భారత జట్టుతో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు పెను సవాలు ఎదురుకానుంది’ అని చెప్పాడు. ఇక ప్రస్తుత టోర్నీలో ఏ జట్టు ఫేవరెట్‌ అనే విషయంలో బోర్డర్‌ సమాధానం దాటవేశాడు. ఇక్కడ ప్రతి జట్టూ ఇతర జట్టును ఓడించేలా కనిపిస్తోందని, ఏ జట్టూ తిరుగులేని ఫేవరెట్‌గా లేదని బోర్డర్‌ అన్నాడు. ఆదివారం భారత్‌-ఆసీస్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు