ఐపీఎల్‌: బర్త్‌ డే రోజే గోల్డెన్‌ డక్‌!

30 Apr, 2018 18:06 IST|Sakshi
ఆండ్రూ రస్సెల్‌

బ్యాట్‌తో నిరాశ పరిచిన.. బంతితో రాణించిన బర్త్‌డే బాయ్‌

ఆదివారంతో 30వ ఏట అడుగుపెట్టిన ఆండ్రూ రస్సెల్‌

బెంగళూరు: చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాట్స్‌మన్‌, బర్త్‌డే బాయ్‌ ఆండ్రూ రస్సెల్‌ గోల్డెన్ డక్‌ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. ఏప్రిల్‌ 29న(ఆదివారం) ఈ విండీస్‌ క్రికెటర్‌ 30వ ఏట అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు విరాట్ కోహ్లి(68 నాటౌట్) రాణించడంతో 20 ఓవర్లలో 4 వికెట్లకు 175 పరుగులు చేసింది. అనంతరం ఓపెనర్ క్రిస్‌లిన్(62 నాటౌట్) విజృంభించడంతో లక్ష్యాన్ని కోల్‌కతా 19.1 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించి విజయాన్ని సొంతం చేసుకుంది. 

కోల్‌కతా ఇన్నింగ్స్ 17వ ఓవర్లో బెంగళూరు బౌలర్ మహ్మద్ సిరాజ్ వేసిన రెండో బంతికి నితీశ్ రాణా ఫోర్ బాదాడు. అనంతరం వెన్ను నొప్పి కారణంగా అతడు మైదానాన్ని వీడాడు. ఈ దశలో వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రూ రస్సెల్‌ క్రీజులోకి వచ్చాడు. అతను క్రీజులోకి వస్తుండుగా అభిమానులంతా హ్యాపీ బర్త్‌డే రస్సెల్‌ అని స్వాగతం పలికారు. కానీ  మూడో బంతిని ఎదుర్కొన్న రస్సెల్‌ తొలి బంతిని భారీ షాట్ ఆడ‌టంతో బంతి కీప‌ర్‌కు స‌మీపంలో చాలా ఎత్తులో లేచింది. ఈ సులువైన క్యాచ్‌ను డికాక్ అందుకోవ‌డంతో పరుగులేమీ చేయకుండా తొలి బంతికే గోల్డెన్ డక్‌గా పెవిలియన్‌ చేరాడు. అయితే బ్యాట్‌తో నిరాశ పరిచిన రస్సెల్‌ బంతితో మూడు వికెట్లు సాధించి  బెంగళూరును కట్టడి చేశాడు. ఇక రస్సెల్‌.. ఆర్సీబీ బ్యాట్స్‌మన్‌ మనన్‌ వోహ్రాను గోల్డెన్‌ డక్‌ చేయడం విశేషం.

whatsapp channel

మరిన్ని వార్తలు