ముంబై : టీమిండియా వన్డే టీమ్ వైస్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మను ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు 2020కు నామినేట్ చేసినట్టు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసీసీఐ) శనివారం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. కాగా ఇశాంత్ శర్మ, శిఖర్ ధావన్, మహిళా క్రికెటర్ దీప్తి శర్మలను అర్జున అవార్డుకు నామినేట్ చేశారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ 2016 జనవరి 1 నుండి 2019 డిసెంబర్ 31 వరకు పరిశీలన కాలంతో సంబంధిత అవార్డులకు ఆహ్వానాలను కోరింది. ఈ మేరకు క్రీడా శాఖ ప్రతిపాధించిన సమయంలో రోహిత్ శర్మ ప్రదర్శన గమనిస్తే టీ20 క్రికెట్లో నాలుగు సెంచరీలు, 8 వన్డేల్లో 150కు పైగా పరుగులు సాధించాడు.(అందుకే స్మిత్ను గేలి చేశా: ఇషాంత్)
2017 ఆరంభం నుంచి వన్డేల్లో 18 శతకాలు నమోదు చేయగా, మొత్తం 28 శతకాలతో వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. కాగా రోహిత్ శర్మ 2019 వన్డే ప్రపంచ కప్లో అత్యద్భుత ప్రదర్శన నమోదు చేశాడు. ఒకే వరల్డ్కప్లలో ఐదు సెంచరీలు నమోదు చేసిన మొదటి బ్యాట్స్మెన్గా రోహిత్ నిలిచాడు. అతని అద్భుతమైన ప్రదర్శన కారణంగానే ఐసిసి వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యాడు. వన్డేల్లో మూడు ద్విశతాకాలు చేసిన ఏకైక క్రికెటర్గానూ రికార్డు హిట్మ్యాన్ పేరిటే ఉంది. మరోవైపు అర్జున అవార్డుకు నామినేట్ అయిన శిఖర్ ధావన్ సైతం కొన్నేండ్లుగా నిలకైడన ప్రదర్శన చేస్తున్నాడు. టెస్టుల్లో పేసర్ ఇషాంత్ శర్మ విజృంభిస్తూ.. ఎంతో కాలంగా జట్టుకు సేవలందిస్తున్నాడు. మరోవైపు భారత మహిళల జట్టు ఆల్రౌండర్ దీప్తి శర్మ మూడేండ్లుగా బ్యాట్తో, బంతితో రాణిస్తూ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నది. వన్డే, టీ20 ప్రపంచకప్ టోర్నీల్లోనూ అద్భుత ప్రదర్శన చేసింది.(స్టోక్స్ కోసం ఏమైనా రూల్స్ మార్చారా?)