బీసీసీఐ మీదే మా పోరాటం

27 Feb, 2018 02:17 IST|Sakshi
బీసీసీఐ

కొరుక్కుపేట: బీసీసీఐలో అవినీతి పెరిగిందని బీహార్‌ కిక్రెట్‌ సంఘం కార్యదర్శి  ఆదిత్య వర్మ ఆరోపించారు. అవినీతిదారుల భరతం పట్టేవరకూ తమ పోరాటం కొనసాగుతుందన్నారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు  శ్రీనివాసన్‌కు తాను వ్యతిరేకం కాదన్నారు. చెన్నై ప్రెస్‌క్లబ్‌లో సోమవారం బీహార్‌ క్రికెట్‌ సంఘం కార్యదర్శి ఆదిత్య వర్మ, జార్ఖండ్‌  క్రికెట్‌ సంఘం కోశాధికారి నరేష్‌ మకాణీ విలేకరులతో మాట్లాడారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌ను కలిసేందుకు తాము ఇక్కడికి వచ్చినట్టు వివరించారు. క్రికెట్‌ క్రీడాభివృద్ధి లక్ష్యంగా 2005 నుంచి తాను పోరాటాలు చేస్తున్నానని  తెలిపారు.

బీహార్, జార్ఖండ్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగా అనేక అవినీతి అరోపణలున్న అమితాబ్‌చౌదరిని ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా నియమించారన్నారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు సన్నిహితుడిగా ఆయన ప్రచారం చేసుకుంటూ, అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో తాను న్యాయ పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. తన పోరాటం బీసీసీఐపైనే కానీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్‌కు వ్యతిరేకంగా మాత్రం కాదని స్పష్టం చేశారు. శ్రీనివాసన్‌తో తనకు వ్యక్తిగత కక్షలు లేవని, ఆయన్ను కలిసి అన్ని వివరాలు తెలియజేస్తామన్నారు.  

మరిన్ని వార్తలు