మళ్లీ మైదానంలోకి జెర్సీ నంబర్‌ ‘10’

9 Feb, 2020 15:04 IST|Sakshi

మెల్‌బోర్న్‌ : క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ టెండూల్కర్‌ దాదాపు ఐదున్నరేళ్ల తర్వాత బ్యాట్‌ పట్టి మైదానంలోకి మరోసారి దిగాడు. ఎదుర్కొన్న తొలి బంతినే ఫోర్‌ కొట్టి తనలో ఇంకా సత్తా తగ్గలేదని నిరూపించాడు. ఈ అపూర్వ ఘట్టం ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఓ చారిటబుల్‌ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. ఆస్ట్రేలియాలో కార్చిచ్చు కారణంగా నష్టపోయిన వారిని అదుకునేందుకుగాను బుష్‌ ఫైర్‌ క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో భాగంగా పాంటింగ్‌ ఎలెవన్‌, గిల్‌క్రిస్ట్‌ ఎలెవన్‌ రెండు జట్లుగా విడిపోయి ఆడనున్నాయి. ఇక పాంటింగ్‌ జట్టుకు సచిన్‌ కోచ్‌గా వ్యవహరించాడు.

భుజం గాయం కారణంగా సచిన్‌ ఆటకు దూరంగా ఉండాలని డాక్టర్ల సూచనను పక్కకు పెట్టి మరీ బ్యాటింగ్‌ చేశాడు. ఇన్నింగ్స్‌ బ్రేక్‌ సందర్బంగా ఆస్ట్రేలియా మహిళల జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఎలైస్‌ పెర్రీ వేసిన ఈ ఓవర్‌ తొలి బంతిని సచిన్‌ తనదైన రీతిలో బౌండరీ తరలించాడు. చూడముచ్చటైన ఈ షాట్‌కు పెర్రీతో సహా సహచర ఆటగాళ్లు, అభిమానులు ఫిదా అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు సచిన్‌తో పెర్రీ కాసేపు సంభాషించి పలు సూచనలు తీసుకున్నారు.   కాగా చాలా కాలం తర్వాత జెర్సీ నంబర్‌ 10 మైదానంలో కనిపించడంతో అటు క్రికెట్‌ ఫ్యాన్స్‌ అటు సచిన్‌ వీరాభిమానులు పండగ చేసుకున్నారు.

చదవండి:
దగ్గరి దారులు వెతక్కండి! 
క్రికెటర్‌కు 17నెలల జైలుశిక్ష

మరిన్ని వార్తలు