భవిష్యత్తులో క్రికెటంటే టీ20లే!

13 Feb, 2018 11:26 IST|Sakshi
జోస్‌ బట్లర్‌ (ఫైల్‌)

టీ20లతో వన్డే, టెస్టు ఫార్మాట్‌లు కనుమరుగు

ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌

సాక్షి, స్పోర్ట్స్‌ : భవిష్యత్తు క్రికెట్‌లో ఒక టీ20 ఫార్మాటే మిగలనుందని ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌ జోస్‌ బట్లర్‌ అభిప్రాయపడ్డాడు. ఓ స్పోర్ట్స్‌ చానెల్‌తో మాట్లాడుతూ.. మరో 10 నుంచి 15 ఏళ్లలో  టెస్టు, వన్డే ఫార్మాట్‌లు కనుమరుగవ్వనున్నట్లు ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ ఏదైనా త్వరగా కావాలని కోరుకుంటున్నారని, దీంతో టీ20కి ఆదరణ పెరుగుతుందన్నాడు.

‘టెస్టు క్రికెట్‌ చరిత్రను మనమంతా ఇష్టపడుతాం. టెస్టు క్రికెట్‌లో ఎదురయ్యే క్లిష్ట పరి‍స్థితులు టీ20 ఫార్మాట్‌లో కనబడవు. ఒక ఆటగాడిని నైపుణ్యం తెలియాలంటే టెస్ట్‌ ఫార్మాట్‌లోనే సాధ్యం. టెస్టు క్రికెట్‌ అంతరించిపోవడం బాధాకరమైన విషయమే.  టెస్ట్‌ ఫార్మాట్‌కు ఆదరణ పెంచేలా ఐసీసీ కృషి చేస్తదని ఆశిస్తున్నా’ అని బట్లర్‌ వ్యాఖ్యానించాడు.

ఇప్పటికి కేవలం 18 టెస్టులే ఆడిన ఈ ఇంగ్లండ్‌ ప్లేయర్‌ ఆస్ట్రేలియాతో జరిగే యాషెస్‌ సిరీస్‌కు ఎంపిక కాలేదు. బట్లర్‌ చివరి టెస్టు 2016లో భారత్‌లో ఆడాడు. టెస్టు క్రికెట్‌ ఆడటమే తనకిష్టమన్న బట్లర్‌ త్వరలో మరిన్ని టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు కృషి చేస్తానని చెప్పుకొచ్చాడు. తన తెల్లబంతి బలాన్ని ఎర్ర బంతితో ఆడటానికి ఉపయోగిస్తానన్నాడు. బట్లర్‌ ఐపీఎల్‌, బీపీఎల్‌, బిగ్‌ బాష్‌ టీ20 లీగ్‌లలో ఆడాడు. ఈ సారి ఐపీఎల్‌ వేలంలో సైతం బట్లర్‌ను రాజస్థాన్‌ రాయల్స్‌ రూ. 4 కోట్ల 40 లక్షలకు తీసుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు