విజేత సీవీ ఆనంద్‌

23 Dec, 2019 02:10 IST|Sakshi

ఆలిండియా పోలీసు టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌

సాక్షి, విశాఖ స్పోర్ట్స్‌: రెండు దశాబ్దాల చరిత్ర కలిగిన ఆలిండియా పోలీసు టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో తొలిసారి సెంట్రల్‌ ఇండ్రస్టియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) ప్లేయర్‌కు పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ లభించింది. వైజాగ్‌లో ఆదివారం ముగిసిన ఈ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, సీఐఎస్‌ఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (ఐజీ) సీవీ ఆనంద్‌ చాంపియన్‌గా అవతరించారు. సీఐఎస్‌ఎఫ్‌ తరఫున బరిలోకి దిగిన ఆనంద్‌ ఫైనల్లో 8–4తో సత్యనారాయణ (ఆంధ్రప్రదేశ్‌)పై విజయం సాధించారు. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆనంద్‌ సెమీఫైనల్లో శైలేశ్‌ కుమార్‌ (బీఎస్‌ఎఫ్‌)ను ఓడించి టైటిల్‌ పోరుకు అర్హత సాధించారు.

గత 20 ఏళ్లలో ఆలిండియా పోలీసు టెన్నిస్‌ చాంపియన్‌షిప్‌లో సీఐఎస్‌ఎఫ్‌కు ఓ విభాగంలో టైటిల్‌ లభించడం ఇదే ప్రథమం. టీమ్‌ చాంపియన్‌íÙప్‌ విభాగంలో సీఆర్‌పీఎఫ్‌ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో ఐటీబీపీపై సీఆర్‌పీఎఫ్‌ గెలిచింది. నాలుగు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో 19 జట్ల నుంచి 103 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ గౌతమ్‌ సావంగ్, ఐబీ స్పెషల్‌ డైరెక్టర్‌ అలోక్‌ ప్రభాకర్, విశాఖపట్నం పోలీసు కమిషనర్‌ ఆర్‌కే మీనా తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు