-

అట్టహాసం.. అంగరంగ వైభవం

5 Apr, 2018 01:12 IST|Sakshi

ఘనంగా ప్రారంభమైన కామన్వెల్త్‌ క్రీడలు

త్రివర్ణ పతాకంతో పీవీ సింధు కవాతు

నేటి నుంచి పతకాల వేట

గోల్డ్‌కోస్ట్‌: పాతికవేల మంది ప్రేక్షక సందోహంతో కిక్కిరిసిన స్టేడియం... మిరుమిట్లుగొలిపే రంగురంగుల దీపాల కాంతులు... ఆకాశం నుంచి ఆశీర్వదిస్తున్నట్లుగా వాన చినుకులు... సంప్రదాయం, స్థానిక ఆచారాల కలబోతగా కార్యక్రమాలు... ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ నగరంలో 21వ కామన్వెల్త్‌ క్రీడలు ఇలా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.  వందన సమర్పణలో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు త్రివర్ణ పతాకంతో ముందు నడవగా మిగతా బృందం ఆమెను అనుసరించింది. ఎప్పటిలా చీరకట్టు, బంద్‌గలాలతో కాకుండా మన క్రీడాకారిణులు బ్లేజర్లు, ట్రౌజర్లతో కవాతు చేయడం ప్రత్యేకంగా నిలిచింది. ‘ప్రపంచంలోనే పురాతన జీవన సంస్కృతి’కి ఆహ్వానం అంటూ అతిథులకు ఆహ్వానం పలుకుతూ కౌంట్‌డౌన్‌ కార్యక్రమం మొదలైంది. అనంతరం ఐరోపా దేశాల దాడిలో దెబ్బతిన్న ఆస్ట్రేలియా సంస్కృతికి నివాళులర్పించారు. ఒకనాటి బ్రిటిష్‌ ఏలుబడిలోని దేశాల మధ్య నిర్వహిస్తున్న ఈ క్రీడలకు ఆనవాయితీగా బ్రిటన్‌ యువరాజు చార్లెస్, ఆయన భార్య కెమిల్లా పార్కర్‌ హాజరయ్యారు. వీరిద్దరూ పరేడ్‌ ట్రాక్‌పై కలిసి నడుస్తూ ప్రేక్షకులకు అభివాదం చేశారు. పోటీలు ప్రారంభమైనట్లు చార్లెస్‌ ఈ సందర్భంగా అధికారికంగా ప్రకటించారు. కామెన్వెల్త్‌ క్రీడలను స్నేహపూరిత క్రీడలుగా ఆయన అభివర్ణించారు. 

►బ్రిటన్‌ ఆధిపత్యాన్ని నిరసిస్తూ క్వీన్స్‌ బ్యాటన్‌ రిలే సందర్భంగా... ఆస్ట్రేలియా మూల వాసులు నినాదాలు చేశారు.  
►వేడుకల ప్రారంభ సమయం లోనే వర్షం కురవడం మొదలైంది. దీంతో కార్యక్రమం కొంత ఆలస్యమైంది. 
► ఆస్ట్రేలియా ఆదిమజాతికి చెందిన, ప్రస్తుత క్రీడల పతకాల రూపకర్తలైన డెల్విన్‌ కొకాటూ–కొలిన్స్‌ల మేన కోడలు ఇసబెల్లా గ్రాహమ్‌ స్మార్ట్‌ఫోన్‌లో 65 వేల ఏళ్ల కౌంట్‌డౌన్‌ను ప్రదర్శించింది. ఇది ముగిసే సమయానికి విస్ఫోటనం నీలం గోపురాన్ని సృష్టించింది. 
►బాలుడిగా హింసను ఎదుర్కొన్న డామియన్‌ రైడర్‌... స్టేడియం చేరుకునే ముందు బ్యాటన్‌ బేరర్‌ను అందుకున్నాడు. 
►పరేడ్‌లో ముందుగా 2014 కామన్వెల్త్‌ గేమ్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన స్కాట్లాండ్‌ బృందం మైదానంలోకి వచ్చింది. 71 దేశాలు మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నాయి. ఇందులో 39 మంది పురుష పతాకధారులు... 32 మంది మహిళా పతాకధారులు ఉన్నారు. పతాకధారుల్లో అత్యధికంగా అథ్లెటిక్స్‌ క్రీడాంశం నుంచి 24 మంది ఉండటం విశేషం.  
►ఈసారి గేమ్స్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఆస్ట్రేలియా మార్చ్‌పాస్ట్‌లో చివరి దేశంగా మైదానంలోకి అడుగు పెట్టింది.  
►ఆస్ట్రేలియాకు చెందిన కరెన్‌ మర్ఫీ (లాన్‌ బౌల్స్‌‡), లీసా అలెగ్జాండర్‌ (నెట్‌బాల్‌) క్రీడాకారుల తరఫున ప్రతిజ్ఞ చేశారు. హాకీ ప్లేయర్‌ మార్క్‌ నోల్స్‌ ఆస్ట్రేలియా తరఫున పతాకధారిగా వ్యవహరించాడు. 

మన బంగారు బోణీ నేడేనా!
గోల్డ్‌కోస్ట్‌: ప్రారంభోత్సవం ముగిసింది. పతకాల వేట మొదలుకానుంది. కామన్వెల్త్‌ గేమ్స్‌లో పోటీల తొలిరోజు గురువారం భారత పసిడి ఆశలన్నీ వెయిట్‌లిఫ్టర్లపై ఆధారపడి ఉన్నాయి. మహిళల 48 కేజీల విభాగంలో ప్రపంచ చాంపియన్‌ మీరాబాయి చానుపై భారీ అంచనాలున్నాయి. గతేడాది అమెరికాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మీరాబాయి స్వర్ణం నెగ్గి సంచలనం సృష్టించింది. ఆమె తన అత్యుత్తమ ప్రదర్శన (194 కేజీలు) కనబరిస్తే ఇక్కడా పసిడి పతకం ఖాయం. బరిలో ఉన్న మిగతా ప్రత్యర్థులకు మీరాబాయి ప్రదర్శనకు మధ్య 10 కేజీల వ్యత్యాసం ఉండటం గమనార్హం. మీరాబాయితోపాటు పురుషుల విభాగంలో గురురాజా (56 కేజీలు), రాజా ముత్తుపాండి (62 కేజీలు) తొలిరోజు పతకాల బరిలో ఉన్నారు. 

మరిన్ని వార్తలు