విజయానికి 2 పరుగులు.. 5 వికెట్లు టపాటపా

8 May, 2019 19:54 IST|Sakshi

జైపూర్‌: ఐపీఎల్‌ మహిళల టి20 చాలెంజ్‌లో భాగంగా బుధవారం ట్రయల్‌ బ్లేజర్స్‌, వెలాసిటీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ చివరల్లో ఆసక్తి చేసింది. ట్రయల్‌ బ్లేజర్స్‌ బౌలర్‌ దీప్తి శర్మ చివరల్లో ముగ్గురిని క్లీన్‌బౌల్డ్‌ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే అప్పటికే వెలాసిటీ టీమ్‌ విజయం ఖాయం అయిపోవడంతో దీప్తి ప్రదర్శన వృధా అయింది. వెలాసిటీ 18 బంతులకు 2 పరుగులు చేయాల్సిన దశలో దీప్తి టపాటపా మూడు వికెట్లు పడగొట్టింది.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన బ్లేజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 112 పరుగులు చేసింది. ఛేజింగ్‌కు దిగిన మిథాలీ సేన 16.5 ఓవర్లలో 111 పరుగులు చేసి మూడో వికెట్‌ నష్టపోయింది. ఇక్కడ నుంచి వరుసగా ఐదు వికెట్లు కోల్పోయింది. టాప్‌ స్కోరర్‌ డానియల్‌ వ్యాట్‌(46)  మూడో వికెట్‌గా ఔటైంది. తర్వాత వేదాకృష్ణమూర్తి రనౌటయింది. ఇక్కడి నుంచి దీప్తి షో మొదలైంది. 

17 ఓవర్‌ తొలి బంతికి మిథాలీ రాజ్‌ను బౌల్డ్‌ చేసింది. మూడో బంతికి శిఖా పాండే, ఐదో బంతికి అమిలా కెర్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసి పెవిలియన్‌కు పంపింది. ఈరోజు మ్యాచ్‌లో దీప్తి పడొట్టిన నాలుగు వికెట్లు క్లీన్‌బౌల్డ్‌ కావడం విశేషం. 4 ఓవర్‌ 5 బంతికి ఓపెనర్‌ హెలే మాథ్యూస్‌ను అవుట్‌ చేసిన దీప్తి చివర్లో మళ్లీ మాయాజాలం చేసింది. విజయానికి 2 పరుగులు చేయాల్సిన దశలో వెలాసిటీ టీమ్‌ ఏకంగా 5 వికెట్లు కోల్పోవడం గమనార్హం. 8 వికెట్ల తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో వెలాసిటీ టీమ్‌ చివరకు మూడు వికెట్ల తేడాతో విజయం దక్కించుకుంది. (చదవండి: మంధానకు షాక్‌.. మిథాలీ సేనదే విజయం)

మరిన్ని వార్తలు