ధోని ధనాధన్‌..

31 Mar, 2019 22:12 IST|Sakshi

చెన్నై: ఐపీఎల్‌లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 176 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. చెన్నై ఆటగాళ్లలో ఎంఎస్‌ ధోని(75 నాటౌట్‌; 46 బంతుల్లో  4 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీకి జతగా, సురేశ్‌ రైనా(36; 32 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక‍్సర్‌), బ్రేవో(27; 16 బంతుల్లో 3 ఫోర్లు)లు ఫర్వాలేదనిపించడంతో సీఎస్‌కే  గౌరవప్రదమైన స్కోరు చేసింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అంబటి రాయుడు(1), షేన్‌ వాట్సన్‌(13), కేదార్‌ జాదవ్‌(8)లు తీవ్రంగా నిరాశపరిచారు. ఆ తరుణంలో సురేశ్‌ రైనా-ఎంఎస్‌ ధోనిల జోడి మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ  61 పరుగులు జత చేసిన తర్వాత రైనా పెవిలియన్‌ చేరగా, బ్రేవోతో కలిసి మరో చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ధోని.

ఈ క్రమంలోనే ధోని హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు తర్వాత ధోని బ్యాట్‌ ఝుళిపించాడు. ప్రధానంగా చివరి ఓవర్‌లో ధోని కొట్టిన హ్యాట్రిక్‌ సిక్స్‌లు హైలైట్‌గా నిలిచాయి. ఉనాద్కత్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో చివరి మూడు బంతుల్ని ధోని సిక్సర్‌లుగా మలచడంతో సీఎస్‌కే స్కోరు బోర్డు వేగంగా కదిలింది. ఆ ఓవర్‌ రెండో బంతిని జడేజా సిక్స్‌ కొట్టగా, మూడో బంతి వైడ్‌ అయ్యింది. అటు తర్వాత జడేజా సింగిల్‌ తీయగా, ధోని తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఆఖరి ఓవర్‌లో మొత్తంగా 28 పరుగులు వచ్చాయి. దాంతో సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ధోని సాధించిన 75 పరుగులు అతని రెండో అత్యుత్తమ ఐపీఎల్‌ స్కోరుగా నమోదైంది. రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్లలో ఆర్చర్‌ రెండు వికెట్లు సాధించగా, ధావల్‌ కులకర్ణి, బెన్‌స్టోక్స్‌, ఉనాద్కత్‌లు తలో వికెట్‌ తీశారు.

Liveblog

మరిన్ని వార్తలు