తెలుగు టైటాన్స్‌కు ఐదో గెలుపు

14 Nov, 2018 01:56 IST|Sakshi

ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్‌ ఐదో విజయం నమోదు చేసుకుంది. గత మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ చేతిలో ఓడిన టైటాన్స్‌ తిరిగి పుంజుకొని పుణేరీ పల్టన్స్‌ను చిత్తుచేసింది. జోన్‌ ‘బి’లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 28–25తో పుణేరీ పల్టన్స్‌పై గెలిచింది. స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి 8, నీలేశ్‌ 6 రైడ్‌ పాయింట్లు సాధించగా... ట్యాక్లింగ్‌లో కృష్ణ (4 పాయింట్లు) ఆకట్టుకున్నాడు.

మరో 5 నిమిషాల్లో మ్యాచ్‌ ముగుస్తుందనగా 27–17తో స్పష్టమైన     ఆధిక్యంలో ఉన్న టైటాన్స్‌ అనూహ్యంగా తడబడి... ప్రత్యర్థికి వరుసగా 7 పాయింట్లు సమర్పించుకొని 27–23తో నిలిచింది. ఈ దశలో రాహుల్‌ చౌదరి సంయమనంతో ఆడి జట్టును గెలిపించాడు. పుణేరీ పల్టన్స్‌ తరఫున సందీప్‌ నర్వాల్‌ 7, మోను 5 పాయింట్లు సాధించారు. ఏకపక్షంగా సాగిన మరో మ్యాచ్‌లో యు ముంబా 41–24తో యూపీ యోధాపై గెలుపొందింది. నేటి మ్యాచ్‌ల్లో తమిళ్‌ తలైవాస్‌తో హరియాణా స్టీలర్స్, యు ముంబాతో బెంగళూరు బుల్స్‌ తలపడనున్నాయి.    

మరిన్ని వార్తలు