హోబర్ట్: మ్యాక్స్వెల్ (58 బంతుల్లో 103 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపు సెంచరీతో పాటు అద్భుత బౌలింగ్ (3/10) ప్రదర్శనతో ముక్కోణపు టి20 సిరీస్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 5 వికెట్లతో గెలిచింది. తొలుత ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేయగా... ఆసీస్ మరో 9 బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి గెలుపొందింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్లో మలాన్ (36 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్లు) ఒక్కడే రాణించాడు.
10 ఓవర్లకు 94/2తో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్ మ్యాక్స్వెల్, అగర్ (2/15)ల ధాటికి తక్కువ స్కోరుకే పరిమితమైంది. అనంతరం ఆస్ట్రేలియా ఇన్నింగ్స్లో మ్యాక్స్వెల్ ఆటే హైలైట్. సహచరులు పెవిలియన్ చేరుతున్నా తనదైన శైలిలో రెచ్చిపోయిన మ్యాక్స్వెల్ ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించాడు. 18.2 ఓవర్లలో ఇరు జట్ల స్కోర్లు సమమైన దశలో మ్యాక్స్వెల్ సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు ఆసీస్ను విజయ తీరాలకు చేర్చాడు. టి20ల్లో మ్యాక్స్వెల్కు ఇది రెండో సెంచరీ.