గోపీ ‘పసిడి’ పరుగు...

27 Nov, 2017 00:45 IST|Sakshi

ఆసియా మారథాన్‌ టైటిల్‌ నెగ్గిన తొలి భారతీయుడిగా రికార్డు

డాంగ్‌గువాన్‌ (చైనా): భారత మారథాన్‌ రన్నర్‌ గోపీ థోనకల్‌ అద్భుతం చేశాడు. ఆసియా మారథాన్‌ చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. ఆదివారం జరిగిన ఈ రేసులో కేరళకు చెందిన గోపీ చాంపియన్‌గా నిలిచాడు. 42.195 కి.మీ. దూరాన్ని గోపీ 2 గంటల 15 నిమిషాల 48 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. తద్వారా పురుషుల విభాగంలో ఈ టైటిల్‌ నెగ్గిన తొలి భారతీయ రన్నర్‌గా గుర్తింపు పొందాడు. ఆండ్రే పెట్రోవ్‌ (ఉజ్బెకిస్తాన్‌–2గం:15ని:51 సెకన్లు) రజతం... బ్యాంబలేవ్‌ సెవీన్‌రవ్‌డాన్‌ (మంగోలియా–2గం:16ని:14 సెకన్లు) కాంస్యం గెలిచారు.  ఓవరాల్‌గా ఆసియా మారథాన్‌లో స్వర్ణం గెలిచిన మూడో భారతీయ రన్నర్‌గా గోపీ నిలిచాడు. గతంలో మహిళల విభాగంలో ఆశ అగర్వాల్‌ (1985లో), సునీత గోదర (1992లో) మాత్రమే స్వర్ణాలు గెలిచారు. 1988 వరకు ఈ మారథాన్‌ రేసు ఆసియా ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఉండేది. 1988 నుంచి ఆసియా చాంపియన్‌షిప్‌ నుంచి వేరు చేసి ఈ మారథాన్‌ రేసును ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.

మరిన్ని వార్తలు