ట్యాంపరింగ్ వివాదంపై హర్భజన్ యూటర్న్

30 Mar, 2018 11:38 IST|Sakshi
క్రికెటర్ హర్భజన్ సింగ్

సాక్షి, న్యూఢిల్లీ: బాల్ ట్యాంపరింగ్ వివాదంపై భారత క్రికెటర్ హర్భజన్ సింగ్ యూ టర్న్ తీసుకున్నాడు. తప్పు చేశారని తేలినా ఆస్ట్రేలియా క్రికెటర్ బాన్ క్రాఫ్ట్‌పై నిషేధం విధించడానికి ఆలోచిస్తున్నారని, కానీ గతంలో తమ జట్టు కేవలం మోతాదుకు మించి అప్పీల్ చేశామన్న కారణంగా ఆరుగురు ఆటగాళ్లపై వేటు వేయడం, మంకీ గేట్ వివాదంలో ఏ తప్పుడు చేయకున్నా తనకు శిక్ష విధించారని ఇటీవల ఆందోళన వ్యక్తం చేశాడు. కానీ కొన్ని రోజుల్లోనే హర్భజన్ తన మనసు మార్చుకుని ఆసీస్ క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లకు మద్ధతు తెలిపాడు. తప్పు చేశారని తేలితే కేవలం ఒకటి లేక రెండు సిరీస్‌లకు పక్కన పెడితే సరిపోతుందని, కానీ ఆటగాళ్లను ఏడాదిపాటు ఆటకు దూరం చేయడం చాలా పెద్దశిక్షేనని ఆసీస్ క్రికెటర్లకు విధించిన నిషేధం నిర్ణయాన్ని హర్భజన్ వ్యతిరేకించాడు. 

ఏడాది నిషేధం.. పెద్ద జోక్
'కేవలం బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారన్న కారణంగా ఏడాదిపాటు నిషేధం విధించడం జోక్‌. వాళ్లు ఏ నేరానికి పాల్పడ్డారని ఇంత పెద్ద శిక్ష వేశారు. ఆట నుంచి ఏడాది పాటు దూరం చేయడం తెలివి తక్కువ నిర్ణయం. ఒక టెస్ట్ సిరీసో లేక రెండు సిరీస్‌లకు నిషేధం పరిమితం చేస్తే సరిపోయేది. కానీ ఇది దారుణం. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లపై నిషేధం గడువును క్రికెట్ స్ట్రేలియా తగ్గించాలంటూ' హర్భజన్ తీవ్ర ఆవేదనతో ట్వీట్ చేశాడు. 

కొన్ని రోజుల కిందట భజ్జీ ట్వీట్ ఇలా..
'వావ్ ఐసీసీ. ట్యాంపరింగ్‌ వివాదంలో గొప్ప శిక్షే వేశారు. అన్ని ఆధారాలున్నా బాన్‌క్రాఫ్ట్‌పై నిషేధం లేదు. గతాన్ని మర్చిపోయారా. మితిమిరి అప్పీల్‌ చేశారన్న కారణంతో 2001 దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఆరుగురు టీమిండియా ప్లేయర్లపై ఒక్కొ మ్యాచ్‌ నిషేధించారు. 2008 సిడ్నీ టెస్టులో ఎలాంటి ఆధారాలు లేకుండానే జాతి వివక్ష వ్యాఖ్యలంటూ (మంకీగేట్‌ వివాదం) నాపై మూడు టెస్టుల వేటేశారు. వ్యక్తిని, అతను ప్రాతినిథ్యం వహించే జట్టును బట్టి అధికారులు శిక్షలను ఖరారు చేస్తుంటారా?' అని ట్వీట్‌ ద్వారా హర్భపన్ ప్రశ్నించాడు.

మరిన్ని వార్తలు