ట్వీట్‌ను డిలీట్‌ చేసిన పాక్‌ క్రికెటర్‌!

21 Jun, 2019 15:25 IST|Sakshi

మాంచెస్టర్‌: వరల్డ్‌కప్‌లో భాగంగా గత ఆదివారం ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ వేదికగా భారత్‌తో ఆడిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టీమ్‌ ఘోర పరాజయం కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మాద్‌. ఫిట్‌నెస్, మ్యాచ్‌ మధ్యలో ఆవలించడం, అతను తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా సోషల్‌మీడియాలో విపరీతమైన ట్రోల్స్‌ వస్తున్నాయి. తాజాగా పాక్‌ బౌలర్‌ హసన్‌ అలీ తాను చేసిన ట్వీట్‌ దుమారం రేపడంతో అతను వార్తల్లో నిలిచాడు.

పాకిస్తాన్‌-ఇండియా మ్యాచ్‌ తర్వాత ఆజ్‌తక్‌ ఛానెల్‌ విలేకరి ముమ్‌తాజ్‌ ఖాన్‌ ‘అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన టీమిండియాకు కంగ్రాట్స్, వరల్డ్‌కప్‌ గెలవాలని కోరుకుంటున్నా’అంటూ ట్వీట్‌  చేశారు. ‘మీ ఆకాంక్ష నెరవేరుతోంది, కంగ్రాట్స్‌’ అంటూ హసన్‌ అలీ ఆమెకు రిప్లై ఇచ్చాడు. అయితే అభిమానుల నుంచి విమర్శలు వెలువెత్తిన  కారణంగా వెంటనే ట్వీట్‌ను డిలీట్‌ చేశాడు.

ఇక హసన్‌ అలీపై పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ నిప్పులు చెరిగాడు. ‘హసన్‌ అలీ వాఘా బోర్డర్‌ వెళ్లి తన ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాడు. కానీ అదే ఉత్సాహాన్ని వరల్డ్‌కప్‌లో ఎందుకు ప్రదర్శించట్లేదు?’ అని ప్రశ్నించాడు. ఇదిలా ఉంచితే, భారత్‌తో మ్యాచ్‌లో హసన్‌ అలీ కేవలం వికెట్‌ మాత్రమే తీసి 84 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ మ్యాచ్‌ మొత్తానికి అదే చెత్త ప్రదర్శనగా నమోదైంది.

మరిన్ని వార్తలు