ఉప్పల్‌ టెస్ట్‌.. టికెట్‌ డబ్బులు వాపస్‌

7 Nov, 2018 15:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు టికెట్లు కొనుగోలు చేసిన వారికి శుభవార్త. గత నెల 12 నుంచి 16 వరకు జరగాల్సిన ఈ మ్యాచ్‌ మూడు రోజుల్లోనే (అక్టోబర్‌–14) ముగిసింది. దీంతో 15, 16వ తేదీల్లో మ్యాచ్‌ వీక్షించాలనుకున్న ప్రేక్షకులకు నిరాశ ఎదురైంది. కాగా... ఆ రెండు రోజుల కోసం ముందుగానే టికెట్లు తీసుకున్న ప్రేక్షకులకు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) టికెట్‌ డబ్బులు తిరిగి ఇవ్వనుంది.

ఈ మేరకు హెచ్‌సీఏ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీని కోసం ఈ నెల 10న ఉదయం గం. 10 నుంచి సాయంత్రం గం. 6 వరకు జింఖానా గ్రౌండ్స్‌లో ప్రత్యేక కౌంటర్‌ ఏర్పాటు చేయనున్నారు. నాలుగో, ఐదో రోజు మ్యాచ్‌ టికెట్లు కొన్న వారు ఒరిజినల్‌ మ్యాచ్‌ టికెట్లతో పాటు బ్యాంక్‌ అకౌంట్‌ వివరాలతో కౌంటర్‌ వద్ద సంప్రదించాలి. ఆన్‌లైన్‌ ద్వారా కొన్న వారికి ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లింపు చేయనున్నారు. మొత్తం మ్యాచ్‌ వీక్షించేందుకు సీజన్‌ టికెట్‌ తీసుకున్న వారికి ఇది వర్తించదు. 

మరిన్ని వార్తలు