ముంబై: సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఆదివారం సమావేశమైన భారత సెలక్టర్లు విరాట్ కోహ్లి సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. గాయం కారణంగా దూరమైన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సఫారీ సిరీస్తో పునరాగమనం చేయనున్నాడు. వెన్నుగాయం కారణంగా గత కొన్ని నెలలుగా హార్దిక్ విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే డీవై పాటిల్ టీ20 టోర్నీలో సూఫర్ ఫామ్తో సత్తా చాటిన హర్దిక్కు జట్టులో చోటు కల్పించారు. హార్దిక్తో పాటు గాయం కారణంగా న్యూజిలాండ్ సిరీస్కు దూరమై ప్రస్తుతం కోలుకున్న శిఖర్ ధావన్ కూడా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు.
గాయం నుంచి కోలుకుంటున్న రోహిత్ శర్మకు సఫారీ సిరీస్కు సైతం విశ్రాంతినిచ్చారు. బ్యాకప్ ఓపెనర్లుగా పృథ్వీషా, శుభ్మన్ గిల్లను ఎంపిక చేశారు. ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న కీపర్ సంజూ శాంసన్కు నిరాశే ఎదురైంది. రిషభ్ పంత్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు. గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్న కేఎల్ రాహుల్, మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్లు తమ స్థానాలను పదిలంగా కాపాడుకున్నారు. బౌలర్లలో భువీ జట్టులోకి వచ్చి చేరగా మహ్మద్ షమీ తన స్థానాన్ని కాపాడుకోలేకపోయాడు. స్పిన్ ద్వయం చహల్, కుల్దీప్లనే ఈ సిరీస్కు సైతం కొనసాగించారు. సీనియర్ స్పిన్నర్, ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను కూడా సఫారీ సిరీస్కు ఎంపిక చేశారు. ఇక దక్షిణాఫ్రికా తమ పర్యటనలో మార్చి 12,15,18 తేదీలలో టీమిండియాతో మూడు వన్డేలలో తలపడనుంది.
టీమిండియా
విరాట్ కోహ్లి(సారథి), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, పృథ్వీ షా, మనీశ్ పాండే, శ్రేయాస్ అయ్యార్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, చహల్, జస్ప్రిత్ బుమ్రా, నవీదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, శుభ్మన్ గిల్.
చదవండి:
హార్దిక్ నామస్మరణతో మార్మోగిన స్టేడియం
ఈసారి కూడా చాంపియన్ ఆస్ట్రేలియానే