క్రికెటర్లకు జన్యు పరీక్షలు!

13 Nov, 2017 04:55 IST|Sakshi

బీసీసీఐ కొత్త నిర్ణయం  

ముంబై: స్కిన్‌ఫోల్డ్‌ టెస్ట్‌... డెక్సా టెస్ట్‌... యోయో టెస్ట్‌... అన్నీ అయిపోయాయి. ఇప్పుడు క్రికెటర్ల జన్యు రహస్యాలు కూడా తెలుసుకునే పనిలో బీసీసీఐ పడింది!  ఫిట్‌నెస్‌ విషయంలో ఎక్కడా రాజీ పడరాదని నిర్ణయించుకున్న బోర్డు, ఇందులో భాగంగా భారత ఆటగాళ్లందరికీ డీఎన్‌ఏ టెస్టులు నిర్వహిస్తోంది. దీని ద్వారా ఆటగాడు శరీరంలోని కొవ్వును కరిగించుకునేందుకు, కండరాల పటిష్టతకు అవకాశం ఏర్పడటంతో పాటు వేగం పెంచుకునేందుకు, కోలుకునే సమయం గురించి మరింత స్పష్టత వచ్చేందుకు కూడా ఈ టెస్టు ఉపయోగపడుతుంది.

ప్రస్తుతం భారత జట్టులో సభ్యుడైన ఆటగాడి శరీరంలో 23 శాతానికి మించి కొవ్వు ఉండరాదు. జనెటిక్‌ ఫిట్‌నెస్‌ టెస్టుగా కూడా పిలుచుకునే ఈ పరీక్షతో ఆటగాడి శరీరానికి సంబంధించి 40 రకాల జీన్స్‌ గురించి సమస్త సమాచారం అందుబాటులోకి వస్తుంది. టీమ్‌ ట్రైనర్‌ శంకర్‌ బసు సూచన మేరకు దీనిని తీసుకొచ్చారు. దీనిని నిర్ధారించిన బీసీసీఐ అధికారి ఒకరు ఈ పరీక్ష కోసం ఒక్కో ఆటగాడికి గరిష్టంగా రూ.30 వేలు అవసరమవుతుందని, అది పెద్ద మొత్తమేమీ కాదని చెప్పారు. ప్రఖ్యాత ఎన్‌బీఏ, ఎన్‌ఎఫ్‌ఎల్‌లలో కూడా డీఎన్‌ఏ టెస్టు అమల్లో ఉంది.  

మరిన్ని వార్తలు