విజయంతో ముగించారు

20 Jun, 2018 01:14 IST|Sakshi

స్పెయిన్‌తో చివరి మ్యాచ్‌లో 

భారత మహిళల జట్టు 4–1తో గెలుపు

మాడ్రిడ్‌: కెప్టెన్‌ రాణి రాంపాల్, డిఫెండర్‌ గుర్జీత్‌ కౌర్‌ రాణించడంతో... స్పెయిన్‌తో ఐదు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌ను భారత మహిళల జట్టు విజయంతో ముగించింది. చివరిదైన ఐదో మ్యాచ్‌లో భారత్‌ 4–1తో ఘనవిజయం సాధించి సిరీస్‌ను 2–2తో ‘డ్రా’ చేసుకుంది. రాణి రాంపాల్‌ 33వ, 37వ నిమిషాల్లో ఫీల్డ్‌ గోల్‌ చేసి భారత్‌కు తిరుగులేని ఆధిక్యాన్ని కట్టబెట్టింది. అనంతరం గుర్జీత్‌ కౌర్‌ (44వ ని., 50వ ని.) ఆరు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ సాధించింది. ఈ రెండింట్లోనూ రాణి కీలకపాత్ర పోషించింది.

స్పెయిన్‌ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను లోలా రియెరా ఆట 58వ నిమిషంలో చేసింది. ఆట మొదలైన ఐదు నిమిషాల్లోనే భారత క్రీడాకారిణులు రెండు పెనాల్టీ కార్నర్‌ అవకాశాలు పొందారు. అయితే స్పెయిన్‌ గోల్‌ కీపర్‌ మరియా రూయిజ్‌ వాటిని సమర్థంగా అడ్డుకుంది. కానీ అనంతరం భారత స్ట్రయికర్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌పై దాడులకు పదును పెట్టారు. రెండో క్వార్టర్‌ నుంచి భారత్‌ దాడులు ఫలితాన్నిచ్చాయి.   

మరిన్ని వార్తలు