టీ 20ల్లో తొలి భారత క్రికెటర్‌గా..

13 Mar, 2018 11:37 IST|Sakshi

కొలంబో: ముక్కోణపు టీ 20 సిరీస్‌ల్లో భాగంగా శ్రీలంకతో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ హిట్‌ వికెట్‌గా పెవిలియన్‌ చేరిన సంగతి తెలిసిందే. ఫలితంగా టీ 20ల్లో హిట్‌ వికెట్‌గా వెనుదిరిగిన తొలి భారత క్రికెటర్‌గా రాహుల్‌ నిలిచాడు. లంకేయులతో మ్యాచ్‌లో రిషబ్‌ పంత్‌ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన రాహుల్‌ 18 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు. జీవన్‌ మెండిస్‌ వేసిన 10 ఓవర్‌ ఐదో బంతిని లెగ్‌ సైడ్‌కు తరలించి సింగిల్‌ తీసే క్రమంలో వికెట్లను కాలితో తాకి పడగొట్టాడు. ఇక్కడ రాహుల్‌ కాలు వికెట్లను తాకి బెయిల్స్‌ పడగొట్టిన విషయం బ్యాట్స్‌మన్‌తో పాటు వికెట్‌ కీపర్‌ కుశాల్‌ పెరీరా కూడా గమనించలేదు. ఇదే సమయంలో బౌలర్‌ మెండిస్‌ సంబరాలు చేసుకోవడంతో రాహుల్‌ అవుటైన విషయం తెలిసింది.  ఈ పొట్టి ఫార్మాట్‌లో ఓవరాల్‌గా హిట్‌ వికెట్‌గా అవుటైన పదో ఆటగాడు రాహుల్‌.

వన్డేల్లో నలుగురు భారత క్రికెటర్లు..

ఇదిలా ఉంచితే, వన్డేల్లో నలుగురు భారత ఆటగాళ్లు మాత్రమే హిట్‌ వికెట్‌గా వెనుదిరిగారు. 1995లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో నయాన్‌ మోంగియా హిట్‌ వికెట్‌గా అవుటయ్యాడు. దాంతో వన్డేల్లో హిట్‌ వికెట్‌గా అవుటైన తొలి భారత ఆటగాడిగా నయాన్‌ నిలిచాడు. ఆ తర్వాత అనిల్‌ కుంబ్లే(2003, న్యూజిలాండ్‌పై), సచిన్‌ టెండూల్కర్‌(2008, ఆస్ట్రేలియా), విరాట్‌ కోహ్లి(2011, ఇంగ్లండ్‌)లు ఉన్నారు. కాకపోతే టెస్టుల్లో, వన్డేల్లో హిట్‌ వికెట్‌గా అవుటైన ఏకైక క్రికెటర్‌ మాత్రం కోహ్లినే. ఇక టెస్టుల్లో తొలి హిట్‌ వికెట్‌గా అవుటైన భారత క్రికెటర్‌ లాలా అమర్‌నాథ్‌..1949లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో అమరనాథ్‌ హిట్‌ వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు.

మరిన్ని వార్తలు