బర్మింగ్హామ్: ఆటపై ఉన్న ప్రేమే సమస్యలపై పోరాడే స్థైర్యమిచ్చిందని, అందువల్లే క్రికెట్లోకి మళ్లీ రాగలిగానని భారత పేసర్ మొహ్మద్ షమీ అన్నాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో అతను తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు పడగొట్టాడు. ఈ సందర్భంగా తన పునరాగమన ప్రదర్శనపై సంతృప్తి వెలిబుచ్చాడు. ‘బౌలర్గా, వ్యక్తిగతంగా నేనిప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నా. దీని కోసమే నేనెంతో కష్టపడ్డాను. రాణించడం ద్వారా నామీదున్న మరకలకు సమాధానమివ్వాలనుకున్నా’ అని షమీ చెప్పాడు.
షమీపై తన భార్య పలు అరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అతను ఐపీఎల్కు కూడా దూరం కావాల్సి వచ్చింది. అనంతరం ఫిట్నెస్ సమస్యలతో అఫ్గానిస్తాన్తో జరిగిన ఏకైక టెస్టుకూ దూరమయ్యాడు. క్రికెట్పై ఉన్న నిబద్ధతే మళ్లీ ఆటలో తనను నిలబెట్టిందని అతను చెప్పుకొచ్చాడు. జీవితంలో, కుటుంబంలో కష్టాలు సహజమని కానీ దేశానికి ప్రాతినిధ్యమనేది బాధ్యతతో కూడిన వ్యవహారమని, దీన్ని సమర్థంగా నిర్వర్తించాలని పేసర్ చెప్పాడు.