తొలి పంచ్‌ అదిరింది

17 Nov, 2018 02:40 IST|Sakshi

ప్రిక్వార్టర్స్‌లో సరిత, మనీషా  

న్యూఢిల్లీ: ప్రపంచ సీనియర్‌ మహిళల బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు సరిత దేవి, మనీషా శుభారంభం చేశారు. శుక్రవారం జరిగిన తొలి రౌండ్‌ బౌట్‌లలో వీరిద్దరు అలవోక విజయాలు సాధించి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకున్నారు. 54 కేజీల విభాగంలో మనీషా 5–0తో క్రిస్టినా క్రుజ్‌ (అమెరికా)పై సంచలన విజయం సాధించగా... 60 కేజీల విభాగంలో ప్రపంచ మాజీ చాంపియన్‌ సరిత దేవి 4–0తో డయానా శాండ్రా బ్రగెర్‌ (స్విట్జర్లాండ్‌)ను ఓడించింది.

ఆదివారం జరిగే ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో కెల్లీ హెరింగ్టన్‌ (ఐర్లాండ్‌)తో సరిత, డీనా జోలామన్‌ (కజకిస్తాన్‌)తో మనీషా తలపడతారు. తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పోటీపడుతున్న హరియాణాకు చెందిన 20 ఏళ్ల మనీషా తన బౌట్‌లో ఆరంభం నుంచి ఆధిపత్యం చలాయించింది. గతంలో రెండుసార్లు ఈ మెగా ఈవెంట్‌లో కాంస్యాలు గెలిచిన 36 ఏళ్ల క్రుజ్‌పై పంచ్‌ల వర్షం కురిపించిన మనీషా ఏకపక్ష విజయాన్ని దక్కించుకుంది.  

మరిన్ని వార్తలు