ఎఫ్‌ఐహెచ్‌ అవార్డు రేసులో మన్‌ప్రీత్‌

7 Dec, 2019 03:43 IST|Sakshi

లుసానే (స్విట్జర్లాండ్‌): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) వార్షిక అవార్డుల్లో భారత్‌ నుంచి ముగ్గురు క్రీడాకారులను నామినేట్‌ చేశారు. భారత సీనియర్‌ పురుషుల జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు రేసులో ఉండగా... వివేక్‌ ప్రసాద్, లాల్‌రెమ్‌సియామి వరుసగా పురుషుల, మహిళల ‘రైజింగ్‌ స్టార్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు బరిలో ఉన్నారు.  27 ఏళ్ల మన్‌ప్రీత్‌ భారత్‌ తరఫున 242 మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు.

అతని సారథ్యంలోనే భారత జట్టు ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో రష్యాపై గెలిచి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. 19 ఏళ్ల వివేక్‌ ప్రసాద్‌ గత ఏడాది యూత్‌ ఒలింపిక్స్‌లో భారత జట్టుకు రజతం దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. 19 ఏళ్ల లాల్‌రెమ్‌సియామి ఆసియా క్రీడల్లో రజతం నెగ్గిన భారత మహిళల జట్టులో సభ్యురాలిగా ఉంది. జాతీయ సంఘాలు, ఆటగాళ్లు, అభిమానులు, హాకీ జర్నలిస్ట్‌లు ఓటింగ్‌లో పాల్గొనవచ్చు. ఓటింగ్‌ వచ్చే ఏడాది జనవరి 17 వరకు కొనసాగుతుంది. ఫిబ్రవరిలో విజేతలను ప్రకటిస్తారు.  

మరిన్ని వార్తలు