ఒలింపిక్స్‌ నిర్వహణకు భారత్‌ సిద్ధం: ప్రధాని మోదీ

27 Oct, 2023 03:53 IST|Sakshi

గోవాలో జాతీయ క్రీడలు షురూ

వచ్చే నెల 9 దాకా ఆటల పండగ  

పనాజీ: జాతీయ ఆటల పండగ గోవాలో అట్టహాసంగా మొదలైంది. గురువారం భారత ప్రధాని నరేంద్ర మోదీ 37వ జాతీయ క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘భారత క్రీడాకారులు అంతర్జాతీయ క్రీడల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నారు. మేం వచ్చాక ప్రత్యేకించి క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు అమలు చేశాం. ప్రతిభావంతుల్ని గుర్తించి ఆర్థిక అండదండలు అందజేస్తూనే ఉన్నాం.

ఈ ఏడాది క్రీడల బడ్జెట్‌ను భారీగా పెంచాం. గత తొమ్మిదేళ్ల బడ్జెట్‌తో పోల్చితే ఇది మూడు రెట్లు ఎక్కువ. ఆచరణ, అమలు తీరుతెన్నులతో భారత క్రీడల ముఖచిత్రం మారుతోంది. మన దేశంలో ప్రతిభకు కొదవలేదు. చాంపియన్లతో అది ఎప్పుడో నిరూపితమైంది. ఒలింపిక్, ఆసియా, కామన్వెల్త్‌ క్రీడల చాంపియన్లు ఎందరో దేశప్రతిష్టను పెంచారు.

ఇక మిగిలింది విశ్వక్రీడల ఆతిథ్యమే! 2036 ఒలింపిక్స్‌ క్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు భారత్‌ సిద్ధంగా ఉంది’ అని ఆయన అన్నారు. జాతీయ క్రీడలను వచ్చేనెల 9 వరకు 15 రోజుల పాటు 28 వేదికల్లో 43 క్రీడాంశాల్లో నిర్వహిస్తారు. రాష్ట్రాలు, సర్విసెస్‌లకు చెందిన 37 జట్లు బరిలో ఉన్నాయి. 10 వేల పైచిలుకు అథ్లెట్లు పతకాల కోసం శ్రమించనున్నారు. ప్రారం¿ోత్సంకంటే ముందుగానే వెయిట్‌లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, నెట్‌బాల్, జిమ్నాస్టిక్స్, ఫెన్సింగ్, బాస్కెట్‌బాల్‌ క్రీడాంశాల్లో పోటీలు మొదలయ్యాయి.   

మరిన్ని వార్తలు