చహర్ స్పిన్ కు తల్లఢిల్లీంది

19 Apr, 2019 04:36 IST|Sakshi

40 పరుగుల తేడాతో ముంబై గెలుపు

మెరిపించిన పాండ్యా బ్రదర్స్‌

గెలిపించిన చహర్‌  

న్యూఢిల్లీ: రాహుల్‌ చహర్‌ మాయాజాలానికి ఢిల్లీ క్యాపిటల్స్‌ చిక్కింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 40 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. కృనాల్‌ పాండ్యా (26 బంతుల్లో 37 నాటౌట్‌; 5 ఫోర్లు), డి కాక్‌ (27 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. హార్దిక్‌ పాండ్యా (15 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడగా, రబడ 2 వికెట్లు తీశాడు. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 128 పరుగులే చేసి ఓడింది. శిఖర్‌ ధావన్‌ (22 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఒక్కడే మెరుగ్గా ఆడాడు. రాహుల్‌ చహర్‌ (3/19) స్పిన్‌తో అలరించాడు. హార్దిక్‌ పాండ్యాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. 

ఓపెనర్ల శుభారంభం... 
టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌ పవర్‌ ప్లేలో వికెట్‌ కోల్పోకుండా 57 పరుగులు చేసింది. కానీ ఆరంభం చాలా స్లోగా నడిచింది. 3 ఓవర్లు ముగిసినా 16 పరుగులే చేయగలిగింది. మోరిస్‌ వేసిన నాలుగో ఓవర్‌తో ముంబై పుంజుకుంది. రోహిత్‌ శర్మ ఫోర్‌ కొట్టగా, డి కాక్‌ 4, 6 బాదాడు. ఆ ఓవర్లో 16 పరుగులొచ్చాయి. కీమో పాల్‌ ఆరో ఓవర్లో ఓపెనర్లు చెరో సిక్సర్‌ బాదడంతో జట్టు స్కోరు 50 దాటింది. పుంజుకుంటున్న దశలో అమిత్‌ మిశ్రా... రోహిత్‌ (22 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్స్‌)ను ఔట్‌ చేశాడు. మరుసటి ఓవర్లో కటింగ్‌ (2)ను అక్షర్‌ పటేల్‌ పెవిలియన్‌ చేర్చడంతో ముంబై ఇన్నింగ్స్‌ గాడితప్పింది. 

వికెట్లున్నా స్కోరు పరుగెత్తదేమీ! 
డి కాక్‌కు సూర్యకుమార్‌ జతయ్యాడు. కానీ మెరుపుల జోరే లేని ఇన్నింగ్స్‌ను డి కాక్‌ రనౌట్‌ మరింత ఇబ్బంది పెట్టింది. 10 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 75/3. అంటే పవర్‌ ప్లే తర్వాత 4 ఓవర్లలో 18 పరుగులే చేయగలిగింది. తర్వాత వికెట్‌ పతనం లేకపోయినా స్కోరు మాత్రం పెరగలేదు. మరో 4 ఓవర్లు ఆడితేగానీ 100 పరుగులు చేయలేకపోయింది. 16వ ఓవర్లో సూర్యకుమార్‌ (27 బంతుల్లో 26; 2 ఫోర్లు) నిష్క్రమించడంతో హార్దిక్, కృనాల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 

పాండ్యా బ్రదర్స్‌ ఆఖరి మెరుపులు... 
పాండ్యా బ్రదర్స్‌ ఉన్నప్పటికీ 16, 17 ఓవర్లలోనూ పెద్దగా పరుగులేమీ రాలేదు. కీమో పాల్‌ వేసిన 18 ఓవర్లో వేగం పుంజుకుంది. కృనాల్‌ ఒక ఫోర్‌ కొడితే... హార్దిక్‌ వరుసగా 4, 6 బాదాడు. ఇద్దరు కలిసి 17 పరుగులు పిండుకున్నారు. తర్వాత మోరిస్‌ బౌలింగ్‌లోనూ హార్దిక్‌ 6, 4 కొట్టాడు. రబడ వేసిన ఆఖరి ఓవర్లో హార్దిక్‌ 6 కొట్టి ఔట్‌కాగా... కృనాల్‌ 2 బౌండరీలతో పోరాడే స్కోరు అందించాడు. 

వేగంగా మొదలై అంతలోనే పతనమై... 
లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు శిఖర్‌ ధావన్, పృథ్వీ షా (24 బంతుల్లో 20; 2 ఫోర్లు) మంచి ఆరంభాన్నిచ్చారు. తొలి ఓవర్లో పృథ్వీ షా, రెండో ఓవర్లో ధావన్‌ రెండేసి ఫోర్లతో వేగం పెంచారు. మలింగ మూడో ఓవర్లోనూ శిఖర్‌ 2 బౌండరీలు బాదాడు. జయంత్‌ యాదవ్‌ తర్వాతి ఓవర్లో శిఖర్‌ భారీ సిక్సర్‌తో విరుచుకుపడ్డాడు. 6 ఓవర్లలో  ఢిల్లీ స్కోరు 48/0. అదేంటో... చిత్రంగా పవర్‌ ప్లేతో పాటే చక్కని ఆరంభం ముగిసింది. వేగంగా పతనం మొదలైంది. తన వరుస ఓవర్లలో రాహుల్‌ చహర్‌ మొదట ధావన్‌ను, తర్వాత పృథ్వీ, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (3)లను ఔట్‌ చేశాడు.

ఈ మధ్యలోనే కృనాల్‌ బౌలింగ్‌లో మున్రో (3) నిష్క్రమించాడు. 48/0తో ఉన్న స్కోరు కాస్తా 11 ఓవర్లలో 65/4గా మారింది. హిట్టర్‌ రిషభ్‌ పంత్‌ (7)ను బుమ్రా పెవిలియన్‌ చేర్చడంతో ఢిల్లీ లక్ష్యఛేదనకు దూరమైంది. ఓపెనర్ల తర్వాత ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ (11; 1 సిక్స్‌), అక్షర్‌ పటేల్‌ (23 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్‌) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. 3 బంతుల వ్యవధిలోనే వీళ్లిద్దరితో పాటే కీమో పాల్‌ (0) కూడా ఔట్‌ కావడంతో వరుసగా మూడు విజయాల తర్వాత ఢిల్లీకి మరో పరాజయం ఎదురైంది. 

మరిన్ని వార్తలు