ప్రిక్వార్టర్స్లో సైనా ఓటమి
ఇండోనేసియా ఓపెన్
జకార్తా: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఇండోనేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. మరో స్టార్ క్రీడాకారిణి సైనాకు ప్రిక్వార్టర్స్లో చుక్కెదురైంది. హెచ్.ఎస్. ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించగా... సమీర్ వర్మ ప్రిక్వార్టర్స్తోనే సరిపెట్టుకున్నాడు. బర్త్ డే గర్ల్ సింధు తన 23వ పుట్టినరోజును విజయంతో జరుపుకుంది.
గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆమె 21–17, 21–14తో జపాన్ ప్రత్యర్థి ఒహొరిని ఇంటి దారి పట్టించింది. ఒహోరిపై సింధుకిది ఐదో విజయం కాగా... వెటరన్ స్టార్ సైనా నెహ్వాల్ 18–21, 15–21తో చైనాకు చెందిన ఐదో సీడ్ చెన్ యుఫే చేతిలో ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ ప్రణయ్ 21–23, 21–15, 21–13తో వాంగ్ జు వీ (చైనీస్ తైపీ)పై చెమటోడ్చి నెగ్గాడు.