సెమీస్‌లోకి సింధు

19 Jul, 2019 18:13 IST|Sakshi

జకార్తా: ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు సెమీస్‌లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్‌లో ఐదో సీడ్‌ సింధు 21–14,  21–7 తేడాతో నొజోమి ఒకుహారా(జపాన్‌)పై వరుస సెట్లలో విజయం సాధించింది. తొలి నుంచి సింధు ఒకుహారాపై ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి సెట్‌లో 5-5తో కొంత పోటీనిచ్చిన ఒకుహారా రెండో సెట్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది. 

సుదీర్ఘ ర్యాలీలు, స్మాష్‌ షాట్లతో హోరెత్తించిన సింధు మొదటి గేమ్‌ను 21–14తో కైవసం చేసుకుంది. అయితే రెండో గేమ్‌లో పూర్తి ఆధిపత్యంతో 21–7తో ఒకహారా పతనాన్ని శాసించి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ప్రిక్వార్టర్‌ మ్యాచ్‌లో సింధు 21–14, 17–21, 21–11 తేడాతో మియా బ్లిచ్‌ఫెల్ట్‌ (డెన్మార్క్‌) పై గెలిచిన విషయం తెలిసిందే. ఇక సెమీస్‌లో చైనా షట్లర్ చెన్ యుఫీతో సింధు తలపడనుంది.

>
మరిన్ని వార్తలు