వైరల్‌: ముంబై ఓటమి.. రాజస్తాన్‌ సంబరాలు

21 May, 2018 19:41 IST|Sakshi

హైదరాబాద్ : ఐపీఎల్‌-11 సీజన్‌లో ప్లే ఆఫ్‌ నాలుగో స్థానం కోసం నాలుగు జట్లు తీవ్రంగా పోటీ పడ్డ విషయం తెలిసిందే. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును ఓడించి ప్లే ఆఫ్‌ రేసులో నిలిచిన రాజస్తాన్‌.. కింగ్స్‌ పంజాబ్‌, ముంబై ఇండియన్స్‌ మ్యాచ్‌ల కోసం వేచి చూసింది. రాజస్తాన్‌ కన్నా ముంబై ఇండియన్స్‌ రన్‌రేట్‌ మెరుగ్గా ఉండటంతో కొంత కలవరపాటుకు సైతం గురైంది. దీంతో ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు ముంబై ఇండియన్స్‌ ఓడిపోవాలని కోరుకున్నారు.

వారు కోరుకున్నట్లే అనూహ్యంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ యువ ఆటగాళ్లు మేటి జట్టైన ముంబై ఇండియన్స్‌ కొంప ముంచారు. కీలక మ్యాచ్‌లో తడబడ్డ రోహిత్‌ సేన టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో రాజస్తాన్‌ ఆటగాళ్ల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ముంబై మ్యాచ్‌ను ఆసక్తికరంగా తిలకించిన రాజస్తాన్‌ ఆటగాళ్లు ఓటమి అనంతరం గెంతులేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఆ జట్టు ఫ్రాంచైజీ అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.  కింగ్స్‌ పంజాబ్‌ సైతం చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో ఓడిపోవడంతో వారి ఆనందం రెట్టింపైంది. టోర్నీ నుంచి ఈ రెండు జట్లు నిష్క్రమించడంతో రాజస్తాన్‌ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించింది. బుధవారం ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుతో రాజస్తాన్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఆడనుంది.

మరిన్ని వార్తలు