రోహిత్‌ శర్మ దూకుడు

16 Jun, 2019 16:08 IST|Sakshi

మాంచెస్టర్‌: వన్డే వరల్డ్‌​కప్‌లో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ దూకుడును ప్రదర్శిస్తున్నాడు. 34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఆది నుంచి తన సహజ సిద్ధమైన బ్యాటింగ్‌తో రోహిత్‌ ఆడుతుండగా, మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ మాత్రం కుదురుగా ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో  టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్‌కు దిగిన భారత ఇన్నింగ్స్‌ను రోహిత్‌ శర్మ, రాహుల్‌లు ఆరంభించారు.

అయితే మహ్మద్‌ ఆమిర్‌ వేసిన తొలి ఓవర్‌ను ఆడిన రాహుల్‌ పరుగులేమీ చేయలేదు. దాంతో మొదటి ఓవరే మెయిడిన్‌ అయ్యింది. ఆ తర్వాత  రెండో ఓవర్‌ మూడో బంతికి రోహిత్‌ ఫోర్‌ కొట్టాడు. అదే ఊపును కొనసాగిస్తూ రోహిత్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో తాను ఆడిన గత ఐదు ఇన్నింగ్స్‌ల్లోనూ కనీసం హాఫ్‌ సెంచరీ మార్కును చేరడం మరో విశేషం. 18 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 101 పరుగులు చేసింది.

>
మరిన్ని వార్తలు