ఆ ప్రకటనలపై సానియా ఫైర్‌

12 Jun, 2019 21:26 IST|Sakshi

హైదరాబాద్‌: ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌పై ప్రసారమవుతున్న టీవీ ప్రకటనలపై టెన్నిస్‌ స్టార్‌ సానియా అసంతృప్తి వ్యక్తం చేశారు. మతిలేని ప్రకటనలతో మితిమీరిన ప్రచారం అక్కర్లేదని వారించారు. ఈ యాడ్‌లపై సానియా స్పందిస్తూ ‘సరిహద్దుకు అవతల, ఇవతల వస్తున్న ప్రకటనలు చిరాకు తెప్పిస్తున్నాయి. ఈ మ్యాచ్‌పై అభిమానులకు ఇప్పటికే కావాల్సినంతగా ఆసక్తి, ఉత్సాహం ఉంది. మీరేమీ అంచనాలు పెంచక్కర్లేదు... మార్కెటింగ్‌ చేయాల్సిన అవసరమూ లేదు. ఇది కేవలం క్రికెట్‌ మ్యాచే. ఇంతకు మించి ఎక్కువ ఊహించుకోకండి’ అని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.
పాక్‌కు చెందిన ఓ టీవీలో భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వేష ధారణలో ఉన్న వ్యక్తితో భారత వ్యూహాలపై ఓ వ్యంగ్య ప్రకటన వస్తోంది. ‘అభినందన్‌ వేషధారణతో, టీమిండియా జెర్సీతో ఓ వ్యక్తి విచారణ గదిలో ఉంటాడు. మీ జట్టు టాస్‌ గెలిస్తే ఏం చేస్తుంది..ఐయామ్‌ సారీ నేనది చెప్పకూడదు అని ఆ వ్యక్తి బదులిస్తాడు. పైనల్‌ టీమ్‌లో ఎవరెవరు ఉంటారు అని మళ్లీ ప్రశ్నిస్తారు. ఐయామ్‌ సారీ నేనది చెప్పకూడదు అని ఆ వ్యక్తి అంటాడు. చివరలో టీ ఎలా ఉంది అనే ప్రశ్నకు.. చాలా బాగుంది అంటాడు. ఇక నువ్‌ వెళ్లొచ్చు అనగానే.. అక్కడ నుంచి ముందుకు కదులుతాడు. అంతలోనే...  కప్పు ఎక్కడికి తీసుకెళ్తున్నావ్‌.. అని చేతిలో నుంచి లాక్కుంటారు’. ఇదిలా ఉండగా.. ఈ ప్రకటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఎన్ని టీ కప్పులు కావాలో తీస్కోండి అని చురకలంటిస్తున్నారు. వచ్చే ప్రపంకప్‌నకు సంబంధించి కూడా మరిన్ని కప్పులు కావాలంటే తీస్కోండని ఎద్దేవా చేస్తున్నారు. ఈ వీడియో వైరల్‌ అయింది.

మరిన్ని వార్తలు