అప్పుడు బౌలింగ్‌లో నాణ్యత ఉంది.. కానీ

26 Aug, 2019 13:42 IST|Sakshi

న్యూఢిల్లీ:   విదేశీ గడ్డపై కూడా టీమిండియా తిరుగులేని విజయాలు సాధించడానికి బౌలింగ్‌ యూనిట్‌ బాగా బలపడటమే కాకుండా నిలకడగా సత్తాచాటడమే కారణమని మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. ఇటీవల కాలంలో టీమిండియా వరుస విజయాల్లో బౌలర్ల పాత్ర అమోఘమన్నాడు. అది భారత క్రికెట్‌ జట్టు బలమైన శక్తిగా ఎదగడానికి కారణమైందన్నాడు. టెస్టుల్లో నంబర్‌ ర్యాంకులో సుదీర్ఘ కాలం కొనసాగడానికి పేస్‌ బౌలింగ్‌​ అటాక్‌ బాగా మెరుగపడటమేనన్నాడు.

‘ప్రస్తుతం భారత్‌ పేస్‌ బౌలింగ్‌ బలంగా ఉండటమే కాదు.. పేసర్ల మధ్య తీవ్రమైన పోటీ ఉంది. ప్రతీ ఒక్కరూ తమకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూనే ఉన్నారు. బుమ్రా, షమీ, భువనేశ్వర్‌, ఉమేశ్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ తదితరులు బౌలింగ్‌ యూనిట్‌లో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామం’ అని సెహ్వాగ్‌ చెప్పుకొచ్చాడు.

అయితే తాను ఆడినప్పుడు కూడా భారత్‌ బౌలింగ్‌ నాణ్యంగానే ఉందనే విషయాన్ని ఒప్పుకోవాలన్నాడు. ‘జవగల్‌ శ్రీనాథ్‌, నెహ్రా, జహీర్‌ ఖాన్‌ల త్రయం చాలా కాలం భారత్‌ పేస్‌ బౌలింగ్‌ యూనిట్‌కు వెన్నుముక వలే నిలిచింది. కాకపోతే అప్పుడు కంటే ఇప్పుడు పేస్‌ విభాగంలో నిలకడ పెరిగింది. భారత్‌ నుంచి పేసర్లు ఎక్కువ రావడమే మన బౌలింగ్‌ మరింత బలపడటానికి కారణం’ అని సెహ్వాగ్‌ విశ్లేషించాడు.

ఇక టెస్టు చాంపియన్‌షిప్‌ను ఐసీసీ తాజాగా ప‍్రవేశపెట్టడాన్ని కూడా సెహ్వాగ్‌ స్వాగతించాడు. సరైన సమయంలో​ టెస్టు చాంపియన్‌షిప్‌ను తీసుకొచ్చారన్నాడు.  దాంతో టెస్టులకు ఆదరణ పెరగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు.  ఈ చాంపియన్‌షిప్‌ వల్ల క్రికెటర్ల కూడా టెస్టులు ఆడటానికి సుముఖంగా ఉంటారని అభిప్రాయపడ్డాడు. యాషెస్‌ సిరీస్‌తో పాటు ప్రస్తుతం జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాడు.  ఇందుకు టెస్టు చాంపియన్‌షిప్‌ను ప‍్రవేశపెట్టడం కూడా ఒక కారణమన్నాడు.

>
మరిన్ని వార్తలు