భారత్‌ లక్ష్యం 228

5 Jun, 2019 18:48 IST|Sakshi

సౌతాంప్టన్‌: వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో  దక్షిణాఫ్రికా 228 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో క్రిస్‌ మోరిస్‌(42) రాణించగా, డుప్లెసిస్‌(38), ఫెహ్లుక్వోయో(34), డేవిడ్‌ మిల్లర్‌(31), డస్సెన్‌(22)లు మోస్తరుగా ఆడారు. రబడా(31 నాటౌట్‌) ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో యజ్వేంద్ర చహల్‌ నాలుగు వికెట్లతో రాణించగా, బుమ్రా, భువనేశ్వర్‌లు తలో రెండు వికెట్లు సాధించారు. కుల్దీప్‌ యాదవ్‌కు వికెట్‌ దక్కింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న దక్షిణాఫ్రికా ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్లు ఆమ్లా(6), డీకాక్‌(10)లు ఆరంభంలోనే పెవిలియన్‌ చేరడంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. ఆమ్లా,డీకాక్‌లను బుమ్రా అద్భుతమైన బంతులతో పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తరుణంలో డుప్లెసిస్‌-డస్సెన్‌ల జోడి మరమ్మత్తులు చేపట్టింది. వీరిద్దరూ 54 పరుగులు జత చేసిన తర్వా డస్సెన్‌ మూడో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. మరో రెండు పరుగుల వ్యవధిలో డుప్లెసిస్‌ కూడా ఔట్‌ కావడంతో దక్షిణాఫ్రికా 80 పరుగుల వద్ద నాల్గో వికెట్‌ను కోల్పోయింది.

ఒకే ఓవర్‌లో డస్సెన్‌, డుప్లెసిస్‌లను చహల్‌ ఔట్‌ చేసి మంచి బ్రేక్‌ ఇచ్చాడు. మరో తొమ్మిది పరుగుల వ్యవధిలో డుమిని ఔటయ్యాడు. కుల్దీప్‌ బౌలింగ్‌లో డుమిని వికెట్లు ముందు దొరికిపోయాడు.  ఆ సమయంలో డేవిడ్‌ మిల్లర్‌-ఫెహ్లుక్వోయో జోడి ఇన‍్నింగ్స్‌ను గాడిలో పెట్టింది. ఈ జోడి 46 పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా కాస్త తేరుకుంది. అయితే డేవిడ్‌ మిల్లర్‌, ఫెహ్లుక‍్వోయోలను స్వల్ప వ్యవధిలో చహల్‌ పెవిలియన్‌కు పంపాడు. దాంతో దక్షిణాఫ్రికా 158 పరుగులకు ఏడు వికెట్లను నష్టపోయింది. అటు తర్వాత మోరిస్‌-రబడాల జోడి భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కోవడంతో దక్షిణాఫ్రికా మళ్లీ పుంజుకుంది. వీరు ఎనిమిదో వికెట్‌కు 66 పరుగులు జత చేయడంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది.

>
మరిన్ని వార్తలు