ఐపీఎల్‌ వేళలపై మల్లగుల్లాలు..

16 Feb, 2018 17:53 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11 సీజన్‌కు సంబంధించి  ఒకే రోజు రెండేసి జరిగే మ్యాచ్‌ల సమయాల్లో మార్పులు లేకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఈ సీజన్‌లో రాత్రి 8 గం.లకు 48 మ్యాచ్‌లు, సాయంత్ర 4 గం.లకు 12 మ్యాచ్‌లను షెడ్యూల్‌ చేశారు. ఈ మేరకు మ్యాచ్‌ వేళల్ని మార్చాలన్న టోర్నీ ప్రసారుదారు స్టార్‌ స్పోర్ట్స్‌ గత నెలలో ఐపీఎల్‌ పాలక మండలికి విజ్ఞప్తి చేసింది. రోజూ వారీ షెడ్యూల్‌ ప్రకారం రెండో మ్యాచ్‌ను రాత్రి 7.00 గంటలకు ఆరంభించాలని, వేసవి వేడి దృష్ట్యా తొలి మ్యాచ్‌ను సాయంత్రం 5.30 ని.లకు ప్రారంభించాలని స్టార్‌ స్పోర్ట్స్‌ ప్రతిపాదించింది. దీనికి పాలకమండలి అంగీకారం కూడా తెలిపింది. రాత్రి మ్యాచ్‌లు త్వరగా ఆరంభమై.. త్వరగా ముగిస్తే కవరేజ్‌ కూడా బాగా వస్తుందని స్టార్‌స్పోర్ట్స్‌ భావించింది.కానీ ఐపీఎల్‌ షెడ్యూల్‌ ప్రకటించే క్రమంలో షెడ్యూల్‌లో ఎటువంటి మార్పులు లేకుంగా గతంలో మాదిరిగానే విడుదల చేసింది. ఇందుకు కారణం తమను సంప్రదించకుండానే ఐపీఎల్‌ పాలకమండలి.. స్టార్‌ స్పోర్ట్స్‌ నిర్ణయయానికి ఆమోదం తెలపడంతో ఐపీఎల్‌ రెవెన్యూ మోడల్‌లో వాటాదారులుగా ఉన్న సగం మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు.


ఎందుకు మార్చాలనుకున్నారంటే..

మ్యాచ్‌ ముగిశాక ప్రేక్షకులు ఇళ్లకు, ఆటగాళ్లు హోటళ్లకు రాత్రి పూట ఆలస్యంగా చేరుకునే సమస్య తీరుతుందని స్టార్‌ స్పోర్ట్స్‌ ఆశించింది. అదే సమయంలో రెండో మ్యాచ్‌ త్వరగా ఆరంభిస్తే ఎక్కువ మంది వీక్షించే అవకాశం ఉంటుందనేది మరొక కారణం. ఒక రకంగా దీనికి ప్రజల నుంచి సానుకూల స్పందనే వచ్చింది. మ్యాచ్‌ కోసం అర్ధ రాత్రి వరకూ మెలకువగా ఉండడం, స్టేడియాలకు వెళ్లిన వారు తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకొనేందుకు పడే ఇబ్బందులు తొలుగుతాయని భావించారు. అయితే, ఫ్రాంచైజీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో బీసీసీఐ పాత వేళలకే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఐపీఎల్‌ షెడ్యూల్‌పై పలు ఫ్రాంచైజీలు మల్లగుల్లాలు పడుతున్నాయి.

>
మరిన్ని వార్తలు