ఆసీస్‌కు గట్టి ఎదురుదెబ్బ..!

7 Oct, 2017 14:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఉంది ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు పరిస్థితి. ఇప్పటికే  ఘోర పరాజయంతో 4-1తో వన్డే సిరీస్‌కు కోల్పోయిన ఆసీస్‌కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత్‌తో నేటి నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌కు ఆ జట్టు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ పూర్తిగా దూరం కానున్నాడు. చివరి వన్డేలో గాయపడ్డ స్మిత్‌, రాంచీ ప్రాక్టీస్‌ సెషన్‌లో తిరగబెట్టడంతో తొలి మ్యాచ్‌కు దూరమైతాడని అందరూ భావించారు. కానీ సిరీస్‌ మొత్తానికి దూరమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

గురువారం ప్రాక్టీస్‌ సెషన్‌ అనంతరం స్మిత్‌ను లోకల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లి ఎంఆర్‌ఐ స్కాన్‌ తీశారు. అయితే చిన్న భుజగాయమేనని వైద్యులు పేర్కొన్నారు. కానీ క్రికెట్‌ ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్‌ మాత్రం భవిష్యత్తు సిరీస్‌లను దృష్టిలో ఉంచుకొని స్మిత్‌కు విశ్రాంతి ఇవ్వాలని యోచిస్తోంది. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో  ప్రతిష్టాత్మక సిరీస్‌ నవంబర్‌ 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు స్మిత్‌ను సంసిద్దం చేయాలని ఆసీస్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.

‘స్మిత్‌కు ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయించాం.తీవ్రమైన గాయమే. ఆటను కొనసాగిస్తే తిరగబెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. స్మిత్‌కు విశ్రాంతి ఇచ్చే యోచనలో ఉన్నాం’ అని టీం డాక్టర్‌ రిచర్డ్‌ సా ఆస్ట్రేలియన్‌ క్రికెట్‌ డాట్‌ కామ్‌ వెబ్‌సైట్‌కు వెల్లడించారు. ఇక స్మిత్‌ తప్పుకుంటే వార్నర్‌ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. అతని స్థానంలో జట్టులోకి మార్కస్‌ స్టోయినీస్‌ రానున్నాడు. స్మిత్‌ దూరమయ్యేది కానిది నేటి మ్యాచ్‌తో తేలనుంది. ఇక శుక్రవారం స్మిత్‌ కేవలం 20 నిమిషాలు మాత్రమే ప్రాక్టీస్‌ చేశాడు.

మరిన్ని వార్తలు