యూఎస్‌ ఓపెన్‌లో సంచలనం..!

4 Sep, 2019 10:38 IST|Sakshi

అన్‌సీడెడ్‌ చేతిలో రోజర్‌ ఫెదరర్‌ ఓటమి

న్యూయార్క్‌ : యూఎస్‌ ఓపెన్‌లో మంగళవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సంచలనం నమోదైంది. స్విస్‌ దిగ్గజం, మూడో సీడ్‌ రోజర్‌ ఫెదరర్‌ అన్‌సీడెడ్‌ గ్రిగోర్‌ దిమిత్రోవ్‌ (బల్గేరియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఆర్థర్‌ ఆషే స్టేడియంలో ఐదు సెట్లపాటు కొనసాగిన ఈ మ్యాచ్‌లో దిమిత్రోవ్‌ 3-6, 6-4, 3-6, 6-4, 6-2 తేడాతో విజయం సాధించాడు. శుక్రవారం జరిగే తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌లో ఐదో సీడ్‌ డానియెల్‌ మెద్వెదేవ్‌ (రష్యా)తో దిమిత్రోవ్‌  తలపడతాడు.

28 ఏళ్ల అనంతరం బల్గేరియా ఆటగాడు యూఎస్‌ ఓపెన్‌ సెమీఫైనల్లో ప్రవేశించడం ఇదే ప్రథమం. ఇక ఫెదరర్‌తో గతంలో జరిగిన ఏడు మ్యాచుల్లో దిమిత్రోవ్‌ పరాజయం పాలయ్యాడు. 20 సార్లు గ్రాండ్‌స్లామ్‌ విజేతైన ఫెదరర్‌ అనూహ్య రీతిలో ఇంటిదారి పట్టడంతో అభిమానులు నిరాశలో మునిగారు. మూడు గంటల 12 నిముషాల పాటు సాగిన క్వార్టర్‌ ఫైనల్లో ఫెదరర్‌ 61 తప్పిదాలు చేయడం గమనార్హం. 39 ఏళ్ల ఫెదరర్‌ ఆటమధ్యలో వీపు నొప్పికి ట్రీట్‌మెంట్‌ కోసం విరామం తీసుకున్నాడు. స్విస్‌ దిగ్గజం ఐదుసార్లు యూఎస్‌ ఓపెన్‌ సాధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు