వసీం అక్రమ్‌కు ఘోర అవమానం

23 Jul, 2019 20:56 IST|Sakshi

మాంచెస్టర్‌: పాకిస్తాన్‌ మాజీ స్టార్‌ బౌలర్‌ వసీం అక్రమ్‌కు మాంచెస్టర్‌ విమానశ్రయంలో ఘోర అవమానం ఎదురైంది. ఇన్సులిన్‌ విషయంలో విమానశ్రయ సిబ్బంది అమర్యాదగా ప్రవర్తించారని, పబ్లిక్‌లో తనపై గట్టిగా అరిచారని ట్విటర్‌ వేదికగా అక్రమ్‌ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఈ రోజు మాంచెస్టర్‌ విమానశ్రయంలో జరిగిన సంఘటనతో తీవ్ర నిరాశ చెందాను. నేను అనేక దేశాలు ఇన్సులిన్‌ వెంటబెట్టుకునే వెళ్లాను. కానీ ఈ రోజు అదే ఇన్సులిన్‌తో మాంచెస్టర్‌లో ఘోర అవమనానికి ఎదురయ్యాను. దీనికి సంబంధించి అధికారులు నన్ను పబ్లిక్‌లో గట్టిగా ప్రశ్నించారు, నాపై అరిచారు. అధికారుల కారణంగా కోల్డ్‌ కేస్‌లో ఉండాల్సిన ఇన్సులిన్‌ చెత్త బుట్టలో పడ్డాయి’అంటూ అక్రమ్‌ ట్వీట్‌ చేశాడు.   

కాగా, వసీం అక్రమ్‌ ట్వీట్‌కు మాంచెస్టర్‌ ఎయిర్‌పోర్టు అఫిషియల్స్‌ స్పందించారు. ‘థ్యాంక్యూ వసీం. ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకొచ్చినందుకు. దీనిపై విచారిస్తాం. మీరు మాకు డైరెక్ట్‌గా మెసెజ్‌ చేస్తే.. మరింత సమాచారం తీసుకోగలం’అంటూ ఎయిర్‌పోర్ట్‌ అఫిషియల్స్‌ ఆక్రమ్‌కు తెలిపారు. ‘త్వరగా స్పందించినందుకు ధన్యవాదాలు. మీకు కాంటాక్ట్‌లో ఉంటాను’అంటూ అక్రమ్‌ రిట్వీట్‌ చేశాడు. ఇక ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో అక్రమ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. టోర్నీ ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణంలో ఉన్న అతడికి ఈ చేదు అనుభవం ఎదురైంది. 104 టెస్టులు, 356 వన్డేలు ఆడినే ఆక్రమ్‌.. పాక్‌ సాధించిన అనేక చారిత్రక విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.  

మరిన్ని వార్తలు