తెలుసు.. అందుకే ముందుకొచ్చా: అశ్విన్‌

9 May, 2018 10:09 IST|Sakshi

జైపూర్‌: ఇంతపెద్ద టోర్నీలో ఒకటో రెండో మ్యాచ్‌లు ఓడిపోవడం పెద్ద విషయం కాదంటున్నాడు రవిచంద్రన్‌ అశ్విన్‌. ఐపీఎల్‌ 2018లో భాగంగా మంగళవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ లెవెన్‌ పంజాబ్‌ 15 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(70 బంతుల్లో 95 నాటౌట్‌) ఒంటరి పోరాటం వృధాఅయిపోయింది. కాగా, బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పు చేసి తాను 3వ స్థానంలో బరిలోకి దిగడాన్ని కెప్టెన్‌ అశ్విన్‌ సమర్థించుకున్నాడు.

పవర్‌ చూపెడదామనుకున్నా: ‘‘మేము పర్‌ఫెక్ట్‌ టీమ్‌ కాదన్న సంగతి మాకు తెలుసు. ప్రయోగాలు చేయకతప్పడంలేదు. వికెట్‌ టఫ్‌గా ఉంది. పోనుపోను బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. కాబట్టి పవర్‌ ప్లేలో ప్రత్యర్థిని అటాక్‌ చేద్దామనుకున్నాం. అందుకే నేను 3వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగాను. వాస్తవానికి మేం బౌలింగ్‌, ఫీల్డింగ్‌ సరిగా చెయ్యలేదు. కీలకమైన క్యాచ్‌లు పట్టిఉంటే రాజస్తాన్‌ స్కోరు ఓ 20 పరుగులు తగ్గిఉండేది. అప్పుడు ఫలితం మరోలా ఉండేది. అఫ్‌కోర్స్‌, ఈ ఓటమి ఈ రోజుకు మాత్రమే పరిమితం. మున్ముందు కూడా ప్రయోగాలు చేస్తాం..’’ అని అశ్విన్‌ వివరించాడు.

ట్రోలింగ్‌: కాగా, అశ్విన్‌ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడంపై సోషల్‌ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. ‘పిచ్‌ హిట్టర్‌ కాకపోయినా ఫస్ట్‌డౌన్‌లో ఎందుకొచ్చావ్‌?’ తరహా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మూడోస్థానంలో వచ్చి రెండు బంతులు ఆడిన అశ్విన్‌.. గౌతం బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అటు ఐపీఎల్‌లో అశ్విన్‌ బ్యాటింగ్‌ గణాకాంలూ ఏమంత గొప్పగాలేవు. ఇప్పటివరకు 121 ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడిన అశ్విన్‌.. 100.34 స్ట్రైక్‌ రేట్‌తో కేవలం 288 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్‌గా 206 టీ20ల్లో 542 రన్స్‌ మాత్రమే సాధించాడు. 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి 12 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్న కింగ్స్‌ పంజాబ్‌..  తన తర్వాతి మ్యాచ్‌ మే 12న కోల్‌కతాతో ఆడనుంది.

మరిన్ని వార్తలు