పుణే ఓపెన్‌ విజేత యూకీ

19 Nov, 2017 01:00 IST|Sakshi

పుణే: భారత్‌లో ఈ సంవత్సరం జరిగిన తొలి ఏటీపీ చాలెంజర్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ పుణే ఓపెన్‌లో భారత స్టార్‌ యూకీ బాంబ్రీ విజేతగా నిలిచాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో యూకీ 4–6, 6–3, 6–4తో భారత్‌కే చెందిన రామ్‌కుమార్‌ రామనాథన్‌ను ఓడించాడు. యూకీ కెరీర్‌లో ఇది ఆరో ఏటీపీ చాలెంజర్‌ టైటిల్‌ కాగా ఈ ఏడాది తొలి టైటిల్‌.

రెండు గంటల రెండు నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో రామ్‌కుమార్‌ 11 ఏస్‌లు సంధించడంతోపాటు 10 డబుల్‌ఫాల్ట్‌లు చేశాడు. తొలి సెట్‌ను కోల్పోయిన యూకీ వెంటనే తేరుకొని రెండో సెట్‌లో రెండుసార్లు, మూడో సెట్‌లో ఒకసారి రామ్‌కుమార్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. విజేతగా నిలిచిన యూకీకి 7,200 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 4 లక్షల 68 వేలు)తోపాటు 80 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.  

ప్రాంజల, నిధి ఓటమి
మరోవైపు మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) ముంబై ఓపెన్‌ టోర్నీలో హైదరాబాద్‌ అమ్మాయిలు యడ్లపల్లి ప్రాంజల, నిధి చిలుముల క్వాలిఫయింగ్‌ తొలి రౌండ్‌లోనే నిష్క్రమించారు. ప్రాంజల 0–6, 0–6తో అనా బొగ్డాన్‌ (రొమేనియా) చేతిలో, నిధి 1–6, 3–6తో అనా మోర్గినా (రష్యా) చేతిలో ఓడిపోయారు.

మరిన్ని వార్తలు