24 గంటలు గడవకముందే చిచ్చు

8 Jan, 2014 23:39 IST|Sakshi
24 గంటలు గడవకముందే చిచ్చు

సాక్షి, ముంబై: మహాకూటమిలోకి స్వాభిమాన్ శేత్కారీ సంఘటన్ చేరి 24 గంటలు గడవకముందే లోక్‌సభ సీట్ల పంపకంపై చిచ్చు మొదలైంది. ఆ పార్టీ నాయకుడు, ఎంపీ రాజు శెట్టి మంగళవారం మహాకూటమిలో చేరిన సంగతి తెలిసిందే. పశ్చిమ మహారాష్ట్రలో రైతుల సమస్యలపై పోరాడుతున్న శెట్టికి అక్కడ మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించిన మహాకూటమి నాయకులు శెట్టితో సంప్రదింపులు జరిపి తమలో చేర్చుకున్నారు.
 అంతవరకూ బాగానే ఉన్నప్నటికీ సీట్ల పంపకాల విషయంలో అప్పుడే రగడ మొదలైంది. స్వాభిమాన్ కంటే తమ పార్టీ పెద్దదని, అందువల్ల ఆ పార్టీకి రెండు సీట్లు కేటాయిస్తే తమకు కనీసం మూడు లోక్‌సభ స్థానాలు ఇవ్వాలంటూ ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవాలే డిమాండ్ చేశారు. మరోవైపు ఆర్‌పీఐకి ఏ పార్టీ ఎన్ని సీట్లు ఇవ్వాలనే అంశంపై బీజేపీ, శివసేనలు ఇప్పటికే మల్లగుల్లాలు పడుతుండగా స్వాభిమాన్‌కంటే తమకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని ఆర్‌పీఐ డిమాండ్ చేయడం మహాకూటమికి తలనొప్పిగా పరిణమించింది. ఇది మున్ముందు మరింత జటిలంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.

మరిన్ని వార్తలు