క్యాబ్‌ ప్రయాణం చవక కాదు

12 Jan, 2018 07:35 IST|Sakshi

బెంగళూరులో చార్జీలు పెంచిన సర్కారు

వాహనం ధరను బట్టి బాదుడు

సాక్షి, బెంగళూరు:  ఇప్పటివరకు సాధారణ క్యాబ్‌కు ఒక ప్రయాణ చార్జీ, ఏసీ క్యాబ్‌కు ఒక చార్జీ వసూలు చేసేవారు. కానీ గురువారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. క్యాబ్‌ వాహనం ధరను బట్టి ఇకనుంచీ క్యాబ్‌ చార్జీలు ఉంటాయి. రాష్ట్ర రవాణా శాఖ క్యాబ్‌ కొత్త ప్రయాణ చార్జీలను నిర్దేశిస్తూ, ఇంతకంటే ఎక్కువ చార్జీలను వసూలు చేయడానికి వీల్లేదని క్యాబ్‌ యజమానులకు స్పష్టంచేసింది. తాజా నిర్ణయంతో బెంగళూరులో క్యాబ్‌ ధరలు కొంతమేర పెరిగాయి. నగరంలోని అన్ని క్యాబ్స్‌ను ఏ, బీ, సీ, డీ విభాగాలుగా విభజించి వాటి కనిష్ట, గరిష్ట ప్రయాణ చార్జీలను నిర్ధారించారు.

ఏ కేటగిరీ.. : ఇక రూ. 16 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ధర ఉన్న వాహనాల్లో తొలి నాలుగు కిలోమీటర్లకు మినిమమ్‌ చార్జీ రూ. 80, ఆ తర్వాత ఒక్కో కిలోమీటరుకు రూ. 20–45 మధ్య చార్జీ చేస్తారు.

బీ కేటగిరీ..: రూ. 10 లక్షల నుంచి రూ. 16 లక్షల మధ్య ధర ఉన్న వాహనాలను డీ కేటగిరీలో ప్రభుత్వం చేర్చింది. వీటిలో తొలి నాలుగు కిలోమీటర్లకు ప్రయాణ కనీస ధర రూ. 68. ఆ తర్వాత ప్రతి ఒక్క కిలోమీటరుకు చార్జీలను కనీసంగా రూ.16, గరిష్టంగా రూ. 34 వసూలు చేస్తారు.

సీ కేటగిరీ..: రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్య ధర ఉన్న వాహనాలను సీ కేటగిరీలోకి వస్తాయి. వీటిలో తొలి నాలుగు కిలోమీటర్లకు ప్రయాణ కనీస ధర రూ. 52. ఆ తర్వాత ప్రతి ఒక్క కిలోమీటరుకు ప్రయాణ చార్జీ రూ.12–24 మధ్య ఉంటుంది.

డీ కేటగిరీ.. : రూ. 5 లక్షల కంటే తక్కువ ధర ఉన్న క్యాబ్‌ వాహనాలను డీ కేటగిరీలో ప్రభుత్వం చేర్చింది. వీటిలో తొలి నాలుగు కిలోమీటర్లకు కనీస ప్రయాణ చార్జీ రూ. 44. ఆ తర్వాత ప్రతి కిలోమీటరుకు కనీసం రూ. 11 నుంచి గరిష్టంగా రూ. 22 మధ్య వసూలు చేసుకోవచ్చు.

వెయిటింగ్‌ చార్జీలు : వీటిని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. తొలి 20 నిమిషాలు ఎలాంటి వెయిటింగ్‌ చార్జీలు ఉండవు. ఆపైనా ప్రతి 15 నిమిషాలకు రూ. 10ను చార్జ్‌ చేస్తారు.
గతంలో క్యాబ్‌ చార్జీలు..
2013, జూన్‌లో రాష్ట్ర ప్రభుత్వం క్యాబ్‌ ధరలను సవరించింది. అప్పట్లో తొలి నాలుగు కిలోమీటర్లు ఏసీ క్యాబ్‌లో రూ. 80, ఆ తర్వాత కిలోమీటరుకు రూ. 19.50 చార్జి.  
నాన్‌ ఏసీ క్యాబ్‌లో తొలి నాలుగు కిలోమీటర్లకు రూ. 70, ఆ తర్వాత కిలోమీటరుకు రూ.14.50 చార్జీ ఉండేది.

మరిన్ని వార్తలు