తక్షణమే రద్దు చేయండి

4 Oct, 2014 22:34 IST|Sakshi

న్యూఢిల్లీ: హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలాకు మంజూరైన బెయిల్‌ను తక్షణమే రద్దుచేయాలని కోరుతూ సీబీఐ... ఢిల్లీ హైకోర్టుకు విన్నవింది. ఈ మేరకు శనివారం ఓ పిటిషన్ దాఖలుచేసింది. అనారోగ ్యం సాకుతో బెయిల్ పొందిన చౌతాలా... ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొనడంద్వారా బెయిల్ పొందే సమయంలో విధించిన నిబంధలను ఉల్లంఘించారని సీబీఐ తన పిటిషన్‌లో ఆరోపించింది. ఈ ఏడాది మే నెలలో బెయిల్ పొందిన చౌతాలాకు ఉపాధ్యాయుల నియామకం కుంభకోణం కేసులో పదేళ్ల కారాగార శిక్ష అనుభవిస్తున్న సంగతి విదితమే. కాగా 76 ఏళ్ల చౌతాలా అనేక పర్యాయాలు బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారని సీబీఐ ఆరోపించింది. గత నెల 25వ తేదీన హర్యానాలోని జింద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నాడని తెలిపింది. బెయిల్ నిబంధనలను ఉల్లంఘించినందువల్ల తక్షణమే దానిని రద్దుచేసి చౌతాలాను తిరిగి కారాగారానికి పంపాల్సిందిగా కోరింది. కాగా ఉపాధ్యాయ నియామకాల్లో కుంభకోణం కేసును విచారించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలా, ఆయన కుమారుడు అజయ్‌తోపాటు మరో ఎనిమిది మందిని దోషులుగా నిర్ధారించింది. వారికి పది సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ 2013, జనవరి 22వ తేదీన తీర్పు వెలువరించిన సంగతి విదితమే.
 

>
మరిన్ని వార్తలు